‘మహానాడు వేదికపై వాళ్లిద్దరూ ఉంటే బాగుండేది’
మనసులోని కోరికను బయటపెట్టిన పురందేశ్వరి
టీడీపీ వ్యవస్థాపకుడు, నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 95వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన కుమార్తె, , జీజేపీ నేత పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుభాటి వెంకటేశ్వర్లు.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టారు.
ఎన్టీఆర్ గురించి తాను కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదన్నారు. ఆయన గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనని అన్నారు. దక్షిణ భారతీయులను మద్రాసీలుగా భావిస్తుంటే తెలుగు వారికి ప్రత్యేక చరిత్ర ఉందని విశ్వవ్యాప్తంగా చాటిన మహనీయులని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తూ అనేక సంస్కరణలతో పాలనను ప్రజలకు దగ్గర చేశారని పురుందేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ పుట్టిన కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ కృష్ణాజిల్లాగా పేరు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు, మహానాడును తెలుగుదేశం ప్రభుత్వం పండుగలా జరుపుకుంటోందని, అలాగే ఎన్టీఆర్ జయంతి మే 28ని తెలుగు జాతి పండుగలా జరపాలని కోరారు. ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని హరికృష్ణ కోరడంలో తప్పులేదని అన్నారు. ఎన్టీఆర్ వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ మహానాడు వేదికపై ఉండుంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. కాగా.. ఈ మహానాడు వేడుకకు హరికృష్ణ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.