ఖబర్దార్ కేసీఆర్.. నీ భాష మార్చుకో.. మాకూ నోరుంది.. బీజేపీ నేత డీకే అరుణ ఫైర్
కేసీఆర్ తన భాష మార్చుకోవాలని, సంస్కారంతో వ్యవహరించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. తమకూ నోరు ఉన్నదని, కానీ సంస్కారం కూడా ఉన్నదని అన్నారు. రాష్ట్రంలో నిరసనలకు పిలుపునిస్తే అరెస్టు చేసే కేసీఆర్కు కేంద్ర ప్రభుత్వంపై ధర్నా చేసే హక్కు ఉన్నదా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలోనూ పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని, తగ్గించే వరకూ విడిచిపెట్టబోమని హెచ్చరించారు.
హైదరాబాద్: BJP జాతీయ ఉపాధ్యక్షురాలు DK Aruna.. తెలంగాణ సీఎం KCRపై విరుచుకుపడ్డారు. BJP పార్టీపై, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలపై ఆయన దుర్భాషలాడటం(Abuse) సరికాదని అన్నారు. ఖబర్డార్ కేసీఆర్.. భాష మార్చుకోవాలని హెచ్చరించారు. మీ నోరును సంభాళించుకోండి.. మీ మంత్రులకు, మీ ఎమ్మెల్యేలకు చెప్పండి.. సంస్కారంగా మెలగండి.. సంస్కారం నేర్చుకోండి అంటూ మండిపడ్డారు. తమకూ నోరు ఉన్నదని, తామూ కేసీఆర్ తరహాలో మాట్లాడగలమని చెప్పారు. కానీ, తమకు సంస్కారం ఉన్నదని వివరించారు. కేసీఆర్కే కాదు.. ప్రతి ఒక్కరికీ నోరు ఉందని అన్నారు. మహిళలంటే.. పెద్దలంటే ఆయనకు సంస్కారం లేదాయే అని చురకలంటించారు. తాను ముఖ్యమంత్రి కాబట్టి.. ఏది మాట్లాడినా.. ఎవరినీ బెదిరించినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం అహంకారమే అని అన్నారు.
Chief Minister పదవి హుందా తనాన్ని మరిచి కేసీఆర్ మాట్లాడుతున్నారని తెలిపారు. నాలుకలు చీరేస్తా.. మెడలు నరికేస్తా.. సన్యాసులు, దద్దమ్మలు వంటి పదాలతో అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. టచ్ చేస్తే కేసీఆర్కు ఎందుకు భయమని అన్నారు. ఊరికే ఎవరూ టచ్ చేయరు కదా అని తెలిపారు. ఇక కేసీఆర్ కొడుకు కేటీఆర్ మాత్రం అసభ్యంగా మాట్లాడితే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నాడని, అలాగే చేస్తే కేటీఆర్ ముందు కేసీఆర్ను జైలుకు పంపాలని అన్నారు.
కేంద్రంపై పోరాడుతారని సీఎం కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో నిరసనలకు ఆయన సహకరించారా? ఏ నిరసనకు పిలుపునిచ్చినా.. అరెస్టు జరిపిన కేసీఆర్కు నియంతలా వ్యవహరించిన ముఖ్యమంత్రికి ధర్నా చేసే హక్కు ఉన్నదా? అని ప్రశ్నించారు. నియంతృత్వంతో నిరసనకారులపై నిర్బంధం మోపే ఆయనకు కేంద్రంపై నిరసన తెలిపే హక్కు ఉన్నదా? అని నిలదీశారు.
Also Read: 'వరి' అస్త్రం: కేంద్రంపై యుద్ధానికి కేసీఆర్ 'సై '
హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఒక్క ఓటరుపై రూ. 20 వేలు ఖర్చుపెట్టారని డీకే అరుణ్ ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు విపరీత ప్రచారం చేశారని, పెట్రోల్, డీజిల్ ధరలంటూ ఊదరగొట్టారని అన్నారు. అయినా.. మట్టి కరిచారని తెలిపారు. అందుకే ఆయనకు జ్ఞానోదయం కలిగిందని, అందుకే రోజూ ప్రెస్ మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. హుజురాబాద్ ఉపఎన్నికలో ఓటమి పాలవ్వడంతో మళ్లీ రోజుకో ముచ్చట చెప్పి, కళ్లిబొల్లి కబుర్లు చెప్పాలనుకుంటున్నారని ఆరోపించారు.
నిన్ను విడిచిపెట్టబోము కేసీఆర్ అంటూ డీకే అరుణ మండిపడ్డారు. కేసీఆర్ డ్రామాలు, కథలు, నాటకాలు ఇకపై సాగవని హెచ్చరించారు. ఆయన రోజు ప్రెస్ మీట్లు పెడుతా అంటున్నారని, ఆయనను ఇలా బయటకు తీసుకురావడమే తమ లక్ష్యమని డీకే అరుణ చెప్పారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన ద్రోహాలు, మోసాలపై మాట్లాడాలి కదా అని అన్నారు.
Also Read: నా ఫాంహౌస్ లో అడుగుపెడితే ఆరు ముక్కలవుతావు: బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్
కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా ఆర్మీ బెదిరిస్తే భారత జవాన్లు పారిపోయి వచ్చారని అన్నారని డీకే అరుణ చెప్పారు. కేసీఆర్కు సోయి ఉండి ఆ మాట అన్నాడా? సోయి లేక ఆ మాట అన్నాడా? అంటూ విరుచుకుపడ్డారు. గాల్వాన్ లోయలో చైనా ఆర్మీతో పోరాడుతూ మరణించి తెలంగాణ బిడ్డ సంతోశ్ బాబును మరిచావా? అంటూ నిలదీశారు. కేసీఆర్ దేశద్రోహిలా మాట్లాడుతున్నారని, అన్ని వక్రభాష్యాలు చెబుతూ మళ్లీ తమపైనే ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. ఇన్ని అబద్ధాలాడే ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడని అన్నారు. నోరు తెరిస్తే అబద్ధాలే అని చెప్పారు. రాష్ట్రంలో రొహింగ్యాలు ఎంత మంది అంటే ఎగ్జాక్ట్గా తెల్వదని కేసీఆర్ కేంద్రానికి చెప్పాడని, ఇలా రోహింగ్యాలను పెంచి పోషించి దేశాన్నే ప్రమాదంలో నెట్టేస్తున్న కేసీఆర్
దేశద్రోహి కాదా? అంటూ అడిగారు.
పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు మొత్తం కేంద్రమే తీసేయాలని కేసీఆర్ మాట్లాడుతున్నారని డీకే అరుణ్ అన్నారు. అసలు ఒక్కసారి కూడా వ్యాట్ పెంచలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు. 2015లో రెండు నెలల్లో రెండు సార్లు పెంచాడని అన్నారు. ఇంత దారుణంగా అబద్ధాలు ఆడతారా? కేసీఆర్ నిజంగా ముఖ్యమంత్రేనా? లేక చిల్లర రాజకీయ నాయకుడా అంటూ ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం చమురుపై పన్ను తగ్గించాక.. చాలా రాష్ట్రాలూ వ్యాట్ తగ్గించాయని అన్నారు. కేసీర్ కూడా పెట్రోల్ రేట్లు తగ్గించాలని, తగ్గించే వరకూ విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎందుకు తగ్గించడు అంటూ ప్రశ్నించారు.