presidential election 2022 : ద్రౌపది ముర్ముపై వివాదాస్పద పోస్ట్.. రామ్గోపాల్ వర్మపై బీజేపీ ఆగ్రహం
వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో వుండే సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ రాష్ట్రపతి ఎన్నికలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ (ram gopal varma) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్డీయే పక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును కించపరిచే విధంగా ఆయన ట్వీట్ చేశారంటూ బీజేపీ (bjp) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అటు ఈ వ్యవహారంపై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh) మండిపడ్డారు. రాష్ట్రపతి అభ్యర్ధిని కించపరిచిన అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్మ ఎప్పుడూ పబ్లిసిటీ కోసం పాకులాడుతూ వుంటాడని.. అందుకే ద్రౌపది ముర్ముపై కామెంట్ చేశారని రాజాసింగ్ ఫైరయ్యారు. ఎస్టీ మహిళగా పేద కుటుంబం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ముకు రాష్ట్రపతిగా అవకాశం దక్కిందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు రాజాసింగ్.
కాగా.. గురువారం రామ్గోపాల్ వర్మ తన ట్విట్టర్లో ఇలా రాశారు. ‘‘ ద్రౌపదీ ముర్ము ప్రెసిడెంట్ ఐతే పాండవులు ఎవరు..? మరీ ముఖ్యంగా కౌరవులు ఎవరు ? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. దీనిపై గిరిజనులు భగ్గుమన్నారు. రామ్ గోపాల్ వర్మ పై ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇకపోతే.. రాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్ధి ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు Draupadi Murmu తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ద్రౌపది ముర్ము వెంట ప్రధాన మంత్రి నరేంద్రమోడీ (narendra modi) , కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు ఎన్డీఏ కూటమికి చెందిన నేతలున్నారు. ముర్ము నామినేషన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించారు. సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ఒడిశా నుండి ద్రౌపది ముర్ము గురువారం నాడు భువనేశ్వర్ నుండి ఢిల్లీకి చేరుకున్నారు. నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో ఆమె సమావేశమయ్యారు. ముర్మును ఎన్డీఏ రాష్ట్రపతి పదవికి అభ్యర్ధిగా ప్రకటించడంతో నితీష్ కుమార్ కు చెందిన జనతాదళ్ (యునైటెడ్), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మద్దతు తెలిపారు.
అటు ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) నేతృత్వంలోని వైసీపీ కూడా ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతును ప్రకటించింది. జార్ఖండ్ లో కాంగ్రెస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న జేఎంఎం కూడా ముర్ము అభ్యర్ధిత్వానికి మద్దతు పలికే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 25వ తేదీ నుండి ముర్ము తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయమై అన్ని పార్టీలను తనకు మద్దతివ్వాలని కోరనున్నారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఎన్సీపీ చీఫ్ శదర్ పవార్ లకు కూడా ముర్ము ఫోన్ చేసి తనకు మద్దతివ్వాలని కోరారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.