ఈటల అయిపోయారు... ఇక టార్గెట్ హరీష్ రావే: తెలంగాణ బిజెపి ఉపాధ్యక్షులు సంచలనం
ఈటల రాజేందర్ వ్యవహారంపై స్పందిస్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై స్పందిస్తూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ఎస్ ప్రభాకర్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఉద్యమకారులను పార్టీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి అనుమానించడం, అవమానించడం... చివరకు శిక్ష వేయడం రోజువారి కార్యకలాపంగా చేసుకున్నారని ఆరోపించారు. గతంలో ఆలె నరేంద్ర నుండి ఇప్పటి ఈటల రాజేందర్ వరకు ఇలాగే జరిగిందన్నారు. కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్ హరీష్ రావేనని ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈటల కూడా పటుమార్లు టీఆర్ఎస్ లో తనతో పాటు హరీష్ రావుకు కూడ అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్న విషయం తెలిసిందే. కేసీఆర్ ఆదేశాల మేరకే ప్రస్తుతం హరీష్ రావు హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తుండవచ్చని ఈటల అన్నారు.
ఇదిలావుంటే ఇటీవలే టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు మాజీ మంత్రి ఈటల. అంతేకాదు ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన వివరించారు. ఆయనతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేసి ఈటల వెంట నడిచారు.
read more పదే పదే నా పేరెందుకు.. నా భుజాలపై తుపాకీ పెట్టొద్దు, చివరి వరకు కేసీఆర్తోనే: ఈటలకు హరీశ్ అల్టీమేటం
రాజీనామా సందర్భంగా ఈటల టీఆర్ఎస్ లో తన రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో గుర్తుచేసుకున్నారు. 19 ఏళ్లపాటు టీఆర్ఎస్తో తనకు ఉన్న అనుబంధాన్ని ఇవాళ్టితో వీడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధుల్లో తాను కూడ ఒకడినని ఆయన చెప్పారు. 2014 కంటే ఎక్కువ మెజారిటీతో హుజూరాబాద్ నుండి తాను విజయం సాధించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఎంపీ పదవికి కవితతో పాటు చాలా మంది టీఆర్ఎస్ నేతలు 2018 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని ఆయన గుర్తు చేశారు.
ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడ చివరి కోరిక ఏమిటని కూడ అడుగుతారన్నారు. కానీ తనపై వచ్చిన ఆరోపణల విషయంలో కనీసం తనను వివరణ అడగకుండానే మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేశారని ఆయన చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకోకుండా రాత్రికే రాత్రికే మంత్రివర్గం నుండి తొలగించారని ఆయన గుర్తు చేశారు. ఎవరో అనామకుడు లేఖ రాస్తే మంత్రిపై విచారణ జరిపారన్నారు. ఈ విషయమై కనీసం తన వివరణ కూడ అడగలేదన్నారు ఈటల.