హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది. తాము ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్టుగా తెలిపింది.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో బీజేపీ కీలక ప్రకటన చేసింది. తాము ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండనున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రకటన చేశారు. పార్టీలో చర్చించిన తర్వాతే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ గడువు ఈరోజుతో ముగియనుంది.
అయితే తొలుత హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని.. ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టుగా బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ.. ఈ ఎన్నికలో పోటీ చేయాలనే ఆలోచనలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాము పోటీ చేయడం లేదని బీజేపీ నుంచి ప్రకటన వెలువడింది.
ఇక, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎంఐఎం తమ పార్టీ అభ్యర్థిగా మీర్జా రెహమత్ బేగ్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఈరోజు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు.
ఇక, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తం 127 ఓట్లు కాగా.. అందులో 9 ఖాళీగా ఉన్నాయి. దీంతో 118 మందికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది. అంటే 60 ఓట్లు వస్తే గెలిచినట్టుగా లెక్క. పార్టీల వారీగా.. ఎంఐఎంకు 52, బీఆర్ఎస్కు 41, బీజేపీకి 25 ఓట్లు ఉన్నాయి. అయితే ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఆ పార్టీ అభ్యర్థి ఎన్నిక లాంఛనం కానున్నట్టుగా భావించాల్సి ఉంటుంది.
