హెచ్సీయూలో మోదీపై బీబీసీ డాక్యూమెంటరీ స్క్రీనింగ్.. పోలీసులకు ఏబీవీపీ ఫిర్యాదు..!
బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లపై ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరుతో రూపొందించిన డాక్యూమెంటరీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ డాక్యూమెంటరీపై కేంద్రం విమర్శలు గుప్పించింది.
బ్రిటీష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) గుజరాత్లో 2002లో జరిగిన అల్లర్లపై ఇండియా: ది మోదీ క్వశ్చన్ పేరుతో రూపొందించిన డాక్యూమెంటరీ తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ డాక్యూమెంటరీపై కేంద్రం విమర్శలు గుప్పించింది. అది పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నదని.. ఎటువంటి నిష్పాక్షికత లేదని కేంద్ర విదేశాంగ శాఖ పేర్కొంది. వలసవాద మనస్తత్వం కొనసాగడం స్పష్టంగా కనిపిస్తుందని విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే ఆ డాక్యుమెంటరీ లింక్ను షేర్ చేసిన ట్విట్టర్, యూట్యూబ్ పోస్టులను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
అయితే తెలంగాణలోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) క్యాంపస్లో శనివారం.. బీబీసీ రూపొందించిన ఇండియా: ది మోదీ క్వశ్చన్ డ్యాక్యూమెంటరీ తొలి భాగం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన గురించి తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఈ విషయంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. అలాగే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు.
ఇక, బీబీసీ గుజరాత్ అల్లర్లపై తీసిన డాక్యుమెంటరీ ఒక దుష్ప్రచారం అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై బురదజల్లే యత్నం అని పేర్కొంది. దేశానికి, మోదీకి అపకీర్తిని తెచ్చిపెట్టే విధంగా ఈ డాక్యుమెంటరీని డిజైన్ చేశారని తెలిపింది. కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం విలేకరులతో ఈ అంశంపై మాట్లాడారు. ‘‘ఇది ఒక ప్రాపగాండ పీస్, అపకీర్తిని తెచ్చిపెట్టే రీతిలో దీన్ని రూపొందించారని భావిస్తున్నాం. పక్షపాతం, లక్ష్యం లేనితనం, వలసవాద మానసిక స్థితి యథేచ్ఛగా కొనసాగుతున్నట్టు మనకు కనిపిస్తుంది’’ అని బాగ్చి అన్నారు.