111 జీవోను ఎత్తివేయడం వెనుక లక్షల కోట్ల స్కాం దాగి వుందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన అన్నారు.
జీవో నెం 111 రద్దుపై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ. .కేసీఆర్కు ఎన్నికల ముందే జనం గుర్తుకువస్తారంటూ దుయ్యబట్టారు. పపోడు భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపలేదని.. ధరణి పోర్టల్తో బీఆర్ఎస్ నేతలు బాగుపడ్డారని సంజయ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ ఆఫీసులకు కారుచౌకగా భూములను లీజ్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కోకాపేటలో రూ. వేల కోట్ల విలువ చేసే భూములను బీఆర్ఎస్ నేతలు తీసుకుంటున్నారని.. గజం రూ.1.10 లక్షలు పలికే భూములను , బీఆర్ఎస్ కార్యదర్శికి 11 ఎకరాలను రూ. 40 కోట్లకే ఇచ్చారని సంజయ్ ఆరోపించారు. డబ్బు కోసమే జీవో నెం 111ను కేసీఆర్ రద్దు చేశారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ALso Read: బండి సంజయ్ ను మార్చే ప్రసక్తే లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ భూములను తీసుకున్నా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని.. కాంగ్రెస్కు పోటీగా ఇప్పుడు బీఆర్ఎస్ ఆ భూములను లూటీ చేసిందని సంజయ్ ఆరోపించారు. ఆ భూముల విషయాన్ని బీజేపీ వదిలిపెట్టదని.. అందులో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ పొంగిపోతోందని సంజయ్ దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బండి సంజయ్ ఆరోపించారు.
111 జీవోను ఎత్తివేయడం వెనుక లక్షల కోట్ల స్కాం దాగి వుందని ఆయన పేర్కొన్నారు. కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు దుష్ఫ్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
