సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల కేటాయింపు సరిగా లేదని ఆరోపించారు. ఉద్యోగుల బదిలీల విషయంలో తాము ఎలాంటి రాజకీయం చేయడం లేదని, స్థానికత, సీనియారిటీ ఆధారంగానే ట్రాన్స్ ఫర్లు చేయమని కోరుతున్నామని బండి సంజయ్ చెప్పారు.
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శస్త్రాలు సంధించారు. ఆయన నేడు వరంగల్ జిల్లా బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు హాజరయ్యారు. జిల్లాల విభజన.. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు శాస్త్రీయంగా జరగలేదని సంజయ్ ఆరోపించారు. సీనియర్, జూనియర్ అంటూ ఉద్యోగుల మధ్య విభజన సృష్టించారని ఆరోపించారు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల ఉద్యోగులు, టీచర్లు నానా ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. ఆయన దుర్మార్గమైన ఆలోచనలతో ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీలు కూడా వెంటనే చేసి జాయిన్ కావాలని ఆదేశించడం వల్ల వారి కుటుంబం చిన్నాభిన్నం అవుతుందన్నారు.
జీవో 317 అమలును వెంటనే నిలిపి వేయాలని, ఉద్యోగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ గారు .. ఏక్ నిరంజన్లా నిర్ణయాలు తీసుకుంటూ.. తుగ్లక్లా వ్యవహరిస్తున్నారన్నారని మండిపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన జీఓను 36 నెలల లోపు పూర్తి చేయకుండా ఫామ్ హౌస్ లో ఉండి ఉద్యోగులపై నిర్లక్ష్యం వహించారని బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్కు ఉద్యోగస్తుల గోస తగులుతుందన్నారు. నూతన జీవో ప్రకారం.. స్థానికత ఆధారంగా 90 శాతం ఉండాలని, కానీ ఎలా చేశారో ఇంతవరకు ప్రభుత్వం చెప్పలేదన్నారు. అనారోగ్యంతో ఉన్న ఉద్యోగస్తుల ఇబ్బందులను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Read Also: పీఆర్సీపై పీటముడి: అధికారుల తీరుపై ఉద్యోగ సంఘాల అసంతృప్తి, జనవరి 3న భవిష్యత్తు కార్యాచరణ
ఉద్యోగుల సమస్యపై సీఎం స్పందించకుంటే.. అసలు విడిచిపెట్టే ప్రసక్తేలేదని, బీజేపీ వారి పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందన్నారు. ఉద్యోగుల సమస్య, ఉద్యోగాల కోసం నిరుద్యోగ యువతను పక్కదారి పట్టించడానికే.. వరి ధాన్యం ముచ్చట ముందుకు తీసుకోచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ ఒప్పందం కుదర్చుకుని, కానీ, బలవంతంగా ఒప్పించారని ఆరోపణలు చేయడం సమజసం కాదని అన్నారు.
Read Also : తెలుగు అకాడమీ స్కామ్ నిందితులపై సస్పెక్ట్ షీట్స్ నమోదు యోచనలో పోలీసులు...
ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ కావాలనే రాజకీయం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఆందోళన చేశారో వారికే తెలియదన్నారు. కేసీఆర్, తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పే రోజు వస్తుందని బండి సంజయ్ విమర్శించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు చర్చించకుండా, ఉద్యోగులు, టీచర్ల అభిప్రాయాలు తీసుకోకుండా వారితో పాటు వారి కుటుంబసభ్యులను అరిగోస పెడుతున్నారని మండిపడ్డారు.
