బండి సంజయ్ పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించినట్టు తెలిసింది. కరీంనగర్‌లో పాదయాత్రతోపాటు రాష్ట్రవ్యాప్తంగా బండి సంజయ్ ప్రచారం చేయడానికి ప్లాన్ సిద్ధమైంది. సుడిగాలి పర్యటనకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ఊపందుకున్నది. బీఆర్ఎస్ ఫుల్ స్వింగ్‌లో ఉండగా.. కాంగ్రెస్ కూడా ఆరు గ్యారంటీలు ప్రకటించి అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నది. బీజేపీ ఇంకా మ్యానిఫెస్టోను ప్రకటించాల్సి ఉన్నది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో క్యాంపెయినింగ్ పైనా బీజేపీ ఫోకస్ పెడుతున్నది. పార్టీ నుంచి పలువురు సీనియర్ నేతలు బయటికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర నేతలపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ పై ఘాటుగా విమర్శలు చేస్తూ మీడియాను, ప్రజల దృష్టిని తన వైపు స్వల్ప కాలంలో తిప్పుకోవడంలో సక్సెస్ అయిన బండి సంజయ్ పై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించినట్టు సమాచారం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

బండి సంజయ్ కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ నెల 6వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ వేయగానే ఆయన పాదయాత్రలు చేపట్టనున్నారు. కరీంనగర్‌లో పాదయాత్ర చేపట్టునున్నారు. కరీంనగర్ టౌన్ నుంచి ఈ పాదయాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం. అయితే, ఆయన పాదయాత్ర కరీంనగర్ నియోజకవర్గానికే పరిమితం కావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన ఎన్నికల ప్రచారం చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలిసింది.

Also Read : Mahadev App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ నుంచి భుపేశ్ బఘేల్ వరకు.. ఈ స్కాం ఏమిటీ? సీఎంకు ఏమిటీ సంబంధం?

ఈ నెల 7వ తేదీన కరీంనగర్‌లో పాదయాత్ర ప్రారంభించి, 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లోనూ పర్యటనలు చేయనున్నట్టు సమాచారం. బండి సంజయ్ గతంలో చేసిన పాదయాత్రలు హిట్ అయ్యాయి. బీజేపీ అర్బన్ ఏరియాకే పరిమితం అనే ముద్రను చెరిపేయడానికి ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగా పార్టీని పల్లెల్లోకి తీసుకెళ్లడంలో కొంత విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ మరోసారి పాదయాత్రను తాను పోటీ చేయనున్న కరీంనగర్ నియోజకవర్గంలో చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.

కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్.. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం 2014, 2018లలో పోటీ చేసినా పరాజయం పాలయ్యారు.