Hookah Parlour: హుక్కా పార్లర్లు బంద్.. నిషేధం విధించే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
హుక్కా పార్లర్లపై నిషేధం విధిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు అసెంబ్లీలో సవరణ బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా మూజువాణి ద్వారా ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా హుక్కా పార్లర్లు బంద్ కానున్నాయి.
![ban on hookah parlour to be implemented as telangana assembly passed bill kms ban on hookah parlour to be implemented as telangana assembly passed bill kms](https://static-ai.asianetnews.com/images/01eewgf45f83r25gz4vpyrr61m/whatsapp-image-2020-08-04-at-4-00-52-pm-jpeg_363x203xt.jpg)
TS Assembly: ఇక నుంచి రాష్ట్రంలో హుక్కా పార్లర్లు బంద్ కానున్నాయి. రాష్ట్రంలోని హుక్కా పార్లర్లను నిషేధించాలనే బిల్లుకు ఈ రోజు ఉదయం అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. సిగరెట్లు, ఇతర తంబాకు ఉత్పత్తు చట్టం 2003 చట్టాన్ని సవరిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఎలాంటి చర్చ లేకుండా మూజువాణి ద్వారా ఆమోదం తెలిపింది.
ఈ రోజు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే సీఎం రేవంత్ రెడ్డి తరఫున అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. హుక్కా పార్లర్లు యువ తరాన్ని నిర్వీర్యం చేస్తున్నదని, అందుకే వీటిపై నిషేధం విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. అందుకే కాలేజీకి వెళ్లే పిల్లలు హుక్కాకు బానిసలు అవుతున్నారని, దీన్ని హుక్కా పార్లర్ల నిర్వాహకులు అదునుగా తీసుకుంటున్నారని వివరించారు.
Also Read: రైతులను పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు ఇష్టపడట్లేదు.. దారి చూపండి: సీఎంకు రైతు సంఘాల విజ్ఞప్తి
సిగరెట్ కంటే కూడా చాలా మార్లు హుక్కా సేవనం ఎక్కువ ప్రమాదకారిణి అని మంత్రి దుద్దిళ్ల తెలిపారు. ఒక గంట హుక్కా సేవించినప్పుడు సుమారు 200 పఫ్లు తీసుకుంటే.. అది వంద సిగరెట్ల కంటే కూడా ప్రమాదకారి అవుతుందని వివరించారు. అందులో చార్కోల్ ఉపయోగిస్తారని, కానీ, ఆ పొగలో కార్బన్ మోనాక్సైడ్, హెవి మెటల్స్, క్యానస్ర్ కారకాలు కూడా ఉండే అవకాశం ఉన్నదని తెలిపారు. కేవలం హుక్కా తాగే వారికే కాదు.. అటు వైపుగా ప్రయాణిస్తున్నవారికి కూడా అది ప్రమాదకరం అని చెప్పారు. బహిరంగంగానూ ప్రజల ఆరోగ్యానికి హుక్కా పార్లర్లు సమస్యగా మారాయని పేర్కొన్నారు.