మంద కృష్ణ మాదిగకు బెయిల్ మంజూరు
- మంద కృష్ణ మాదిగకు బెయిల్ మంజూరు
- సాయంత్రం విడుదల కానున్న మంద కృష్ణ
ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతూ జైలుపాలైన ఎమ్మార్పీఎఫ్ అద్యక్షులు మంద కృష్ణ మాదిగకు బెయిల్ లభించింది. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన సికింద్రాబాద్ సివిల్ కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి పదిరోజులకోసారి కార్ఖాన, రాంగోపాల్ పేట్ పీఎస్ లలో హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఇద్దరు వ్యక్తులతో పదివేల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.
ఎమ్మార్పిఎఫ్ కార్యకర్త భారతి మృతితో పాటు ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎమ్మార్ఫిఎఫ్ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ట్యాంక్ బండ్ పై చేపట్టిన నిరసనలో ఉద్రిక్తతలు నెలకొనే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగానే మంద కృష్ణ మాదిగను అరెస్ట్ చేశారు. అప్పటినుంచి అతడు చంచల్ గూడ జైళ్లోనే ఉన్నాడు. ఇలా ఓ ఎస్సీ ఉద్యమ నాయకుడిని అరెస్ట్ చేసి జైళ్లో పెట్టడంపై అటు ప్రజా సంఘాలు, ఇటు రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఓ ఉద్యమకారుడిని అక్రమంగా అరెస్టు చేసి ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తోందని అరోపణలు వెల్లువెత్తాయి.
అయితే మంద కృష్ణ బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఇవాళ సాయంత్రం 6 గంటలకు మంద కృష్ణ చంచల్ గూడ జైల్ నుండి విడుదల కానున్నట్లు పోలీసులు తెలిపారు.