18 గంటలైనా దొరకని పసిపాప ఆచూకీ, బీదర్లో కిడ్నాపర్
కోఠి కిడ్నాప్ కేసులో పోలీసుల పురోగతి
హైదరాబాద్:కోఠి ఆసుపత్రి నుండి ఆరు రోజుల పసికందును టీకా ఇప్పిస్తానని కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. కోఠి ఆసుపత్రి నుండి సోమవారం మధ్యాహ్నం పూట ఓ మహిళ ఆరు రోజుల అమ్మాయిని కిడ్నాప్ చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని ఎల్లమ్మతండాకు చెందిన విజయ ఆరు రోజుల క్రితం ప్రసవం కోసం కోఠి ఆసుపత్రిలో చేరింది. అయితే మంచంపై నుండి కదల్లేనిస్థితిలో ఉన్న విజయను చూసిన ఓ మహిళ టీకాను ఇప్పిస్తామని చెప్పి ఆరు రోజుల విజయ కూతురును కిడ్నాప్ చేసింది.
దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. పసికందును కిడ్నాప్ చేసిన మహిళ ఎంజీబీఎస్ బస్స్టేషన్లో బీదర్ బస్సు ఎక్కిందని సోమవారం రాత్రి పోలీసులు గుర్తించారు.
ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో లభించిన సీసీటీవి దృశ్యాల ఆధారంగా పోలీసులు ఆ మహిళను గుర్తించారు. ఆ మహిళ బీదర్కు వెళ్లేందుకు ఎక్కిన బస్సు కూడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థగా గుర్తించారు.
మంగళవారం నాడు ఉదయమే బీదర్కు వెళ్లిన తెలంగాణ పోలీసులు బస్సు డ్రైవర్, కండక్టర్ను విచారించారు. అయితే పసికందుతో నీలం రంగు చీర కట్టుకొన్న మహిళ బీదర్లో దిగిందని బస్సు డ్రైవర్,కండక్టర్ పోలీసులకు తెలిపారు.
ఇప్పటికే మూడు పోలీసులు బృందాలు బీదర్కు చేరుకొని ఆ మహిళ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే ఆ మహిళతో పాటు ఇంకా ఎవరైనా ఆమెకు తోడుగా ఉన్నారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే పసిపాపను కిడ్నాప్ చేసిన మహిళను గుర్తించారు. అయితే బీదర్ లో ఆమె ఎక్కడకు వెళ్లిందనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆరు రోజుల పసిపాప కిడ్నాపై 18 గంటలు దాటింది. ఇంకా ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.