దేశంలో మొన్నటివరకు సాగిన విదేశీ పాలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరమగీతం పాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. 

కరీంనగర్: దేశంలో మొన్నటివరకు సాగిన విదేశీ పాలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరమగీతం పాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బుధవారం జిల్లాలో అయోధ్యలో రామమందిర భూమి పుజా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవిత్ర భారత దేశంలో హిందువులు బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి చూశామని, ప్రధాని మోడీ దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా సంకల్ప దీక్షతో అయోధ్యాపురంలో భూమి పూజ చేయడం యావత్భారత ప్రజలు మర్చిపోలేని రోజన్నారు.

 ఆగస్టు 5వ తేదీన చరిత్ర లిఖించిన రోజని, 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నామని బండి సంజయ్ అన్నారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు, సాధు సంతులు, కర సేవకులు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం బలిదానం చేశారని గుర్తు చేశారు. ఆత్మబలి దానం చేసిన వారికి శక్తివంతమైన ఈ రోజును అంకితం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

రామ మందిర నిర్మాణం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందంటూ విమర్శించారని, విదేశీ పాలన కొనసాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సజాతి, ఆత్మాభిమాన పాలన మోదీ నాయకత్వంలో అందించబోతున్నామని బండి వ్యాఖ్యానించారు. ఏనాడూ ఓటు బ్యాంకు రాజకీయాలు బీజేపీ చేయలేదని.. రామరాజ్యం నిర్మాణమే లక్ష్యంగా మోడీ పాలన కొనసాగుతోందన్నారు. హిందూ జాతి ఐక్యతగా శక్తివంతమైన నిర్మాణం అయోధ్యలో జరగనుందని, కార్యకర్తగా కరసేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆనాడు ములాయం సింగ్ ప్రభుత్వం కాల్చివేతకు పాల్పడిన ఘటనను ఎవరూ మర్చి పోలేరని గుర్తుచేశారు.