ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోంది.. హైదరాబాద్లో అల్లర్లకు కుట్ర: అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన కామెంట్స్పై ముస్లిం సమాజం నుంచి తీవ్ర నిరనస వ్యక్తం అవుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజాసింగ్ కామెంట్స్ను ఖండిస్తున్నట్టుగా తెలిపారు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వీడియోపై ముస్లిం సమాజం నుంచి తీవ్ర నిరనస వ్యక్తం అవుతుంది. తాజాగా ఈ వ్యవహారంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. రాజాసింగ్ కామెంట్స్ను ఖండిస్తున్నట్టుగా తెలిపారు. ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోందని ఆరోపించారు. 8 ఏళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని చెప్పారు. హైదరాబాద్లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తుందని సంచలన కామెంట్స్ చేశారు. ‘‘మాతో రాజకీయంగా పోరాడండి. మేము దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టవద్దు. మతపరమైన అల్లర్లను ప్రేరేపించవద్దు. ప్రవక్తను మరియు ముస్లిం సమాజాన్ని అవమానించడం బీజేపీ అధికారిక విధానం’’ అని అసదుద్దీన్ పేర్కొన్నారు.
‘‘బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాను. హైదరాబాద్లో శాంతిభద్రతలు ఉండేలా చూడటం బీజేపీకి ఇష్టం లేదు. ప్రవక్త మహమ్మద్ను, ముస్లింలను బీజేపీ ద్వేషిస్తోంది. వారు భారతదేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ, బీజేపీ మద్దతు ఇవ్వకపోతే వారు స్పందించాలి. అదేవిధంగా కొందరు లేవనెత్తిన నినాదాలను (సార్ తాన్ సే జుడా) ఖండిస్తున్నాను. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని వారికి చెబుతున్నాను’’అని అసుదుద్దీన్ చెప్పారు.
ఇక, మహ్మద్ ప్రవక్తను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజా సింగ్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని సోమవారం రాత్రి హైదరాబాద్లో నిరసనలు చేలరేగాయి. మునావర్ ఫరూఖీకి సంబంధించిన కామెడీ షో కి సంబంధించి రాజాసింగ్ విడుదల చేసిన వీడియోలో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు రాజాసింగ్పై కేసు నమోదు చేశారు. అనంతరం ఈ రోజు ఉదయం రాజాసింగ్ను ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు.