తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను పదో తరగతి ప్రశ్నపత్నాల లీకేజి కేసులో అరెస్ట్ చేయడంపై ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. 

అమరావతి :తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీలో సంజయ్ పాత్ర లేకున్నా కుట్రలో భాగంగానే అరెస్ట్ చేసారని ఆరోపించారు. గతంలోనూ బిజెపిని దెబ్బతీసేందుకు ఇలాగే కుట్రలు పన్నారని... అయినా వారి ఆటలు సాగలేవని అన్నారు. బిఆర్ఎస్ కుట్రలకు బిజెపి భయపడబోదని సోము వీర్రాజు అన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు డబ్బు సంపాదించాలనే కేసీఆర్ ఇలా పేపర్ల లీకేజీకి కుట్రలు పన్నిందని వీర్రాజు ఆరోపించారు. ఈ విషయం బయటపడటంతో నిందను బిజెపి పై వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పేపర్ల లీకేజీ ముమ్మాటికి బిఆర్ఎస్ ప్రభుత్వ పిరికిపంద చర్యే... ఇటువంటి వాటికి బిజెపి భయపడబోదని సోము వీర్రాజు అన్నారు.

Read More డీజీపీ నుండే సరైన సమాధానం లేదు: బండి సంజయ్ అరెస్ట్ ను తప్పుబట్టిన కిషన్ రెడ్డి

ఇదిలావుంటే ఇప్పటికే బండి సంజయ్ అరెస్ట్ పై బిజెపి అధిష్టానం కూడా ఆరా తీస్తోంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు ఫోన్ చేసి సంజయ్ అరెస్ట్, పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంజయ్ కు బిజెపి అధిష్టానం పూర్తిగా మద్దతుగా నిలవనుందని జాతీయాధ్యక్షుడు చెప్పినట్లు సమాచారం. 

బండి సంజయ్ అరెస్ట్ పై బిజెపి ఇంచార్జి తరుణ్ చుగ్ కూడా న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఏ వ్యవస్థను గౌరవించడం లేదని... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటని అన్నారు. వాట్సాప్ లో మేసేజ్ వస్తే చూడడం తప్పా... కావాలనే బిజెపి నేతలు, కార్యకర్తలపై కేసీఆర్ సర్కార్ తప్పుడు కేసులు బనాయిస్తుందని తరుణ్ చుగ్ ఆరోపించారు. 

ఇప్పటికే సంజయ్ అరెస్టుపై రాష్ట్ర డిజిపితో మాట్లాడినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.అయితే ఈ కేసుకు సంబంధించిన ఫైలు తయారవుతోందని ... ఇది పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని డీజీపీ తనకు తెలిపారని కిషన్ రెడ్డి వివరించారు. సరైన కారణం చెప్పకుండానే బండి సంజయ్ ను ఎలా అరెస్ట్ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు.