Hydra : హైడ్రా కమీషనర్ పదవినుండి రంగనాథ్ తొలగింపు... అసలు కారణమేంటో తెలుసా?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన హైడ్రా వివాదాల్లో చిక్కుకుంది. ఏకంగా ఈ సంస్థ కమీషనర్ ను హైకోర్టు తొలగించే పరిస్థితి వచ్చిందంటేనే ఏ స్థాయిలో వివాదాస్పదం అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అసలు రంగనాథ్ ను తొలగించడానికి కారణమేంటో తెలుసా?

హైడ్రా కమీషనర్ తొలగింపుకు హైకోర్టు ఆదేశం
Hydra (Hyderabad Disaster Response and Asset Protection Agency) : హైడ్రా... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గట్టిగా వినిపిస్తున్న పేరు. రాజధాని హైదరాబాద్ లో కార్యకలాపాలు సాగించే ఈ ప్రభుత్వ సంస్థ ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే కాదు రాజకీయాల్లో పెద్ద చర్చకు కారణమయ్యింది. ఈ హైడ్రా అధికార, ప్రతిపక్షాల ఎన్నికల అస్త్రంగా మారిందంటేనే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా ఏర్పాటునుండి ఇప్పటివరకు చేపట్టిన ప్రతి ఆపరేషన్ వివాదాస్పదమే.. చివరికి తెలంగాణ హైకోర్టు కమీషనర్ రంగనాథ్ ను తొలగింపుకు ఆదేశించే వరకు పరిస్థితి వచ్చింది.
హైడ్రాకు సంబంధించిన ఓ వివాదంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఘాటుగా స్పందించింది. హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన న్యాయస్థానం ఈసారి సంచలన ఆదేశాలు జారీ చేసింది. వెంటనే హైడ్రా కమీషనర్ బాధ్యతల నుండి రంగనాథ్ ను తప్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఆయన స్థానంలో అన్ని అర్హత కలిగి సమర్థంగా పనిచేసే అధికారిని నియమించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
హైడ్రా కమీషనర్ ను ఎందుకు తొలగిస్తున్నారు?
సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని లోతుకుంటలో సర్వే నెంబర్ 1,2 గల 40 ఎకరాల భూమికి సంబంధించి వివాదం నడుస్తోంది. ఆర్మీకి సంబంధించిన ఈ భూముల్లోకి హైడ్రా అక్రమంగా ఎంటర్ అవుతోంది అనేది వివాదం. హైడ్రా వ్యవహారతీరుపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది... దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన న్యాయస్థాయం ఆ భూముల్లోకి హైడ్రా అధికారులు వెళ్లకూడదని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను ధిక్కరించి హైడ్రా ఓవరాక్షన్ చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి... అందుకే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా రియాక్ట్ అవుతోంది.
ఇప్పటికే హైడ్రా కమీషనర్ రంగనాథ్ ను కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది... అతడి వ్యవహారతీరును తీవ్రంగా తప్పుబట్టింది. తమ ఆదేశాలను దిక్కరిస్తూ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న అతడి ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని కూడా హెచ్చరించింది. ఇలా రంగనాథ్ పై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలుకావడాన్ని కోర్టు సీరియస్ గా తీసుకుంది... అందుకే అతడిని తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చట్టాన్ని ధిక్కరించే వ్యక్తి హైడ్రా వంటి సంస్థకు కమీషనర్ గా ఉండటం సరికాదని... అతడికి తొలగించడం తప్ప మరో మార్గం లేదని తెలంగాఐ హైకోర్టు పేర్కొంది.
హైకోర్టుకు రంగనాథ్ క్షమాపణలు
లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయస్థానం తన తీరుపట్ల ఆగ్రహంగా ఉందని గ్రహించిన హైడ్రా కమీషనర్ క్షమాపణలు కోరుతూ ఓ అఫిడవిట్ దాఖలు చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని... కోర్టు ఆదేశాలను ఎక్కడా ధిక్కరించలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు అవాస్తవాలతో కోర్టును తప్పదారి పట్టిస్తున్నారని... హైడ్రా అధికారులు లోతుకుంట భూముల్లోకి వెళ్లలేదని అఫిడవిట్ ద్వారా కోర్టుకు తెలిపారు.
అయితే అతడి వాదనను కోర్టు నమ్మలేదు... న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటే 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించింది. వీటిపై ఏం సమాధానం చెబుతారని రంగనాథ్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇలాంటి అధికారి హైడ్రా కమీషనర్ గా అనర్హుడని పేర్కొన్న న్యాయస్థానం తొలగించక తప్పదని తెలిపింది. ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించింది.
హైడ్రా కమీషన్ పనితీరుపై తీవ్ర ప్రభావం
కమీషనర్ రంగనాథ్ తొలగింపు హైడ్రా రోజువారీ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాకుండా దాని విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ సంస్థ తీసుకున్న అనేక కీలక నిర్ణయాలపై ఇప్పుడు సందేహాలు తలెత్తే అవకాశం ఉంది… ముఖ్యంగా హైదరాబాద్ లో ఆక్రమణల పేరిట చేపట్టిన కూల్చివేతలు, ఇతర నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం అవుతాయి... ప్రజలు సమగ్ర సమీక్షకు డిమాండ్ చేయవచ్చు. ఈ పరిణామం ప్రభుత్వ సంస్థలలో పారదర్శకత, సరైన నియామక ప్రక్రియల ఆవశ్యకతను స్పష్టం చేస్తుంది. ప్రజల్లో ప్రభుత్వ సంస్థలపై విశ్వాసం పెంపొందించడం, హైడ్రా భవిష్యత్తు కార్యాచరణను స్థిరీకరించడం ప్రస్తుతం ఎదురయ్యే అతి పెద్ద సవాళ్లు. నిస్సందేహంగా ఇది హైడ్రా కమీషన్ కు గడ్డు కాలమే.

