తెలంగాణలో మరో పోలీస్ ఆత్మహత్య
- వేములపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న మాధవి
- ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం
తెలంగాణ లో పోలీసుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది.తాజాగా నల్గొండ జిల్లా వేములపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మాధవి అనే మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. తాను నివాసం ఉండే అద్దె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల తెలంగాణ లో పోలీసుల మరణాలు సర్వసాధారణంగా మారాయి. కారణాలు వేరువేరుగా ఉన్నప్పటికి గత కొన్ని రోజులుగా పోలీసు శాఖలో ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి.
మాధవి ఆత్మహత్య కు ప్రేమ వైఫల్యమే కారణమై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆమె రూం లో క్లూస్ కోసం వెదుకుతున్న పోలీసులకు వ్యక్తిగత డైరీ దొరికింది. దాంట్లో చివరి ఫేజీలో నన్నెందుకు మోసం చేశావురా అంటూ ఆమె రాసుకుంది. దీంతో ఈ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.ఈమేరకు మిర్యాలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.