కేసీఆర్,ఎంఐఎంకు చెక్: సీఏఏకు అనుకూలంగా హైద్రాబాద్లో బీజేపీ సభ
హైద్రాబాద్ లో సీఏఏకు అనుకూలంగా భారీ సభను ఏర్పాటు చేయాలని బీజేపీ భావిస్తోంది. సీఏఏకు వ్యతిరేకంగా కేసీఆర్, ఎంఐఎం చేస్తున్న విమర్శలకు ఈ సభ ద్వారా చెక్ పెట్టాలని ఆ పార్టీ తలపెట్టింది.
హైదరాబాద్:వచ్చే నెల 15వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించనున్న భారీ సభకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అమిత్ షా, పవన్ కళ్యాణ్ సభకు హాజరుకానుండడంతో కాషాయ నేతలు ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్ బిజెపి కార్యాలయంలో ముఖ్య నేతలతో సోమవారం నాడు భేటీ అయ్యారు.
Also read:తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి ఎవరికి దక్కునో: నేతల మధ్య తీవ్ర పోటీ
ఈ బహిరంగ సభకు జనసమీకరణ చేయడంపై దృష్టి సారించాలని పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించారు. సి ఏ ఏ పై బీజేపీ తమ అభిప్రాయాన్ని సభ ద్వారా స్పష్టం చేయాలని భావిస్తోంది. ఇప్పటికే జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో భారీ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడంతో జాతీయ నాయకత్వం కూడా ఈ సభపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సభకు హాజరు కావడంతో బీజేపీ నేతలు జన సమీకరణను ప్రతిష్టాత్మకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.సి ఏ ఏ కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే నిరసన గళం వినిపిస్తున్న డంతో అదే స్థాయిలో సీఏఏకు అనుకూలంగా గళం వినిపించాలని బీజేపీ ఈ సభను నిర్వహించాలని తలపెట్టింది.
బిజెపి నేతలు కూడా ఇటీవల కాలంలో అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. టిఆర్ఎస్కు, సీఎం కెసిఆర్ కు వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.ఇందుకు ఈ సభను బీజేపీ వేదికగా ఎంపిక చేసుకొంది.
జాతీయ స్థాయిలో కూడా తమ బలాన్ని నిరూపించుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి భారీగా జన సమీకరణకు చేయడంతోపాటు మైనారిటీలను కూడా పెద్ద ఎత్తున ఈ సమావేశానికి హాజరయ్యేలా చూడడం పై బిజెపి నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.