తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి.

తెలంగాణలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను సిద్దం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ విషయంలో అధికార బీఆర్ఎస్ ఒక్క అడుగు ముందని చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్‌‌రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు.. రాష్ట్రంలోని పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ బ్లూప్రింట్‌ను రూపొందిస్తున్న సమయంలో.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పలు అంశాలపై మార్గనిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణ‌లో 75 అసెంబ్లీ స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పార్టీని బలోపేతం చేయాలని రాష్ట్ర నాయకులకు అమిత్ షా చెప్పినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే తొలుత 60 మందితో కూడిన మొదటి అభ్యర్థుల జాబితాను సిద్దం చేసేందుకు నాయకులు శ్రమిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే కొద్ది రోజుల క్రితం.. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేల, ఎంపీలతో కూడిన బీజేపీ అభ్యర్థుల జాబితా తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 30కి పైగా స్థానాలు ఉన్నాయి. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. 

ఇక, రాష్ట్రంలో బీజేపీ నుంచి ఉన్న నలుగురు ఎంపీలతోపాటు, సీనియర్ నేతలంతా అసెంబ్లీకి పోటీ చేయాలని బీజేపీ అధిష్టానం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తంగా 60 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేయాలనే నిర్ణయంతో బీజేపీ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం వివిధ జిల్లాల నుంచి డేటా సేకరించే కసరత్తు కూడా ప్రారంభమైందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. 

అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి టీమ్‌లో అనూహ్య మార్పులు చేసేందుకు సిద్ధంగా లేకపోయినా.. బండి సంజయ్ రాష్ట్ర పార్టీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఇతర పార్టీల నుంచి చేరిన వారికి కూడా పాధ్రాన్యత ఇవ్వాలని భావిస్తోంది. దాదాపు 1,000 మంది జిల్లా , గ్రామస్థాయి నాయకులను గుర్తించి.. వారికి త్వరలోనే క్షేత్రస్థాయిలో పార్టీ బాధ్యతలను అప్పగించనున్నట్టుగా సమాచారం.