ఖురాన్ పై ప్రమాణం చేసి చెబుతున్నా.. నా కుమారుడు తప్పు చేయలేదు.. షకీలే కక్షసాధిస్తున్నాడు.. అల్తాఫ్ తండ్రి ఆవేద
తన కొడుకు ఎలాంటి తప్పూ చేయలేదంటూ అల్తాఫ్ తండ్రి ఖురాన్ తల మీద పెట్టుకుని ప్రమాణం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.
బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ కు చెందిన ఎంఐఎం నాయకుడు అల్తాఫ్ తండ్రి మహమ్మద్ భాఖీ తన కుమారుడు ఏ తప్పు చేయలేదంటూ ఖురాన్ మీద ప్రమాణం చేసి చెబుతున్నానంటూ కన్నీటి పర్యంతమయిన వీడియో వైరల్ అవుతోంది. ఆయన ఏమన్నారంటే…‘ ఖురాన్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు.. తప్పుడు కేసులో అరెస్టు చేసి జైలులో పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతకీ ఈ అల్తాఫ్ ఎవరూ అంటే.. బోధన్ ఎంఎల్ఏ షకీల్ హత్యకు కుట్ర పన్నాడని ఆరోపణలతో ఈ నెల 17న అరెస్టే జైల్లో ఉన్న యువకుడు. గురువారం బక్రీద్ ప్రార్థనలు ముగిసిన తర్వాత అల్తాఫ్ తండ్రి మహమ్మద్ బాఖీ ప్రార్థనల ముందుకు వచ్చి.. ఈ మేరకు ప్రమాణం చేశారు. బోధన్ పట్టణంలోని ఈద్గా మైదానంలో జరిగిన ఈ ప్రార్థనల తర్వాత తలపై ఖురాన్ గ్రంథంను పెట్టుకుని ఇలా ఏడుస్తూ మొరపెట్టుకున్నాడు. ఎమ్మెల్యే షకీల్ తమమీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు.
ఖమ్మంలో భట్టి పాదయాత్ర ముగింపు సభకి భారీ ఏర్పాట్లు.. 100 ఎకరాల్లో బహిరంగ సభ..
అక్కడున్న మిగతా వారందరూ ఆయనని సముదాయించి.. ఇంటికి పంపించారు. ఆ తరువాత ఆయన ప్రమాణం చేయడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అల్తాఫ్ తల్లి కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఎంఐఎం పార్టీ తరఫున మహ్మద్ బాఖీ భార్య మహమ్మదీ బేగం 31వ వార్డు కౌన్సిలర్ గా ఉన్నారు.
అయితే ఎమ్మెల్యే షకీల్ మాత్రం దీని మీద విభిన్నంగా స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం రాత్రి ఓ వీడియోని విడుదల చేశారు. మహమ్మద్ బాఖీ తన కుమారుడు ఈ నేరం చేయలేదంటూ ప్రమాణం చేస్తున్నాడు సరే…ఆయన కొడుకు అయిన అల్తాఫ్ మీద ఉన్న ఇతర పదుల సంఖ్యలో కేసుల మీద ఎందుకు ప్రమాణం చేయడం లేదో చెప్పాలంటూ ప్రశ్నించారు.
‘అల్తాఫ్, నవీద్ అనే నిందితులు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. వారిద్దరు నామీద దాడి చేయడానికి వచ్చారు. ప్రజలు, పోలీసులు ఉండడంతో వెనక్కి తగ్గారు. వీరికి ఉగ్రవాదులతోను సంబంధాలు ఉన్నాయి. శరత్ అనే వ్యక్తితో కలిసి.. డబ్బుల కోసం నన్ను చంపి, అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. అయితే వారి వ్యవహారం పోలీసులు బట్టబయలు చేశారు. వారి ఫోన్లో జరిగిన సంభాషణలను పోలీసులు సేకరించడంతో.. వారికుట్ర బయటపడింది. ఇప్పుడు ఇలా తప్పుదోవ పట్టించే వ్యవహారం చేస్తున్నాడు. వీటిని ప్రజలు పట్టించుకోవద్దు’ అని ఆ వీడియోలో విజ్ఞప్తి చేశారు.