తెలంగాణలో బీజేపీ, జనసేన దోస్తీ: ఖమ్మం కార్పోరేషన్లో కలిసి పోటీ
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది.
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కుదిరింది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జనసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, పూర్వపు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీరామ తాళ్లూరి, పార్టీ కార్యానిర్వాహక కార్యదర్శి రామారావు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
గత ఏడాది డిసెంబర్ మాసంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చింది.ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అప్పట్లో జనసేన నిర్ణయం తీసుకొంది. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి , మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ లు పవన్ కళ్యాణ్ తో చర్చించారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించింది. నామినేషన్లు దాఖలు చేసిన జనసేన అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకొన్నారు.
ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైద్రాబాద్ స్థానంలో జనసేన చీఫ్ టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. పీవీ నరసింహారావు కూతురు వాణీదేవికి జనసేన మద్దతు తెలిపింది. కానీ ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. ఏ డివిజన్ లో ఏ పార్టీ పోటీ చేయాలనే విషయమై రెండు పార్టీల నేతలు ఇవాళ సమావేశమై చర్చించారు.