ఓవైసీ... అక్కడ గెలిచాడే..!
- బీఎంసీ ఎన్నికల్లో బోణి కొట్టిన మజ్లిస్
కేవలం హైదరాబాద్ లోని పాతబస్తీకే ఏఐఎంఐఎం (ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మీన్) పార్టీ పరిమితమని ఇతర పార్టీలు విమర్శిస్తుంటాయి.
అయితే ఆ విమర్శలకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ గెలుపుతోనే సమాధానం ఇస్తూ వస్తున్నారు.
2014 ఎన్నికల ముందు నుంచే మజ్లిస్ ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఓవైసీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో తరచూ పర్యటిస్తూ అక్కడ పార్టీని పటిష్టం చేస్తున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తో పాటు మహారాష్ట్రలోనూ తన పార్టీ తరఫున అభ్యర్థులను దింపారు.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బైకుల్లా స్థానాలలో తన పార్టీని గెలిపించుకున్నారు.
ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లోనూ ఖాతా తెరవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన సభలకు మైనారిటీల నుంచి అక్కడ మంచి స్పందనే వస్తోంది.
కాగా, ఈ రోజు వెలువడిన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కూడా మజ్లిస్ పార్టీ ఖాతా తెరిచింది.
227 వార్డులున్న బీఎంసీలో 59 చోట్ల మజ్లిస్ పోటీ చేసింది. చీతా క్యాంప్, బైకుల్లా వార్డులలో జయకేతనం ఎగరవేసింది. అలాగే, షోలాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 వార్డులను గెలచుకుంది.