తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు అంటూ డ్రామాను మొదలు పెట్టారని ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ విమర్శించారు. 

హైదరాబాద్: తెలంగాణ ప్రజలను మోసం చేయడంలో భాగంగానే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన అని ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ విమర్శించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ గురువారం నాడు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు.ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ వైఫల్యం చెందారన్నారు. ఓట్ల కోసం కేసీఆర్ ప్రజలను మభ్యపెట్టేలా హామీలిచ్చారని ఆయన విమర్శించారు. 

తన కుటుంబంపై వచ్చిన అవినీతి ఆరోపణల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు.అందుకే జాతీయ పార్టీ అంటూ కేసీఆర్ డ్రామాలు మొదలుపెట్టారని యాష్కీ చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టినా ఒరిగేదేమీ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉన్న ప్రాంతీయపార్టీల నేతలతోనే కేసీఆర్ సంప్రదింపులు జరుపుతున్నారని మధు యాష్కీ చెప్పారు. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పేరుతో చేస్తున్న చర్చలు పరోక్షంగా బీజేపీకి సహకరించే విధంగా ఉందని మధు యాష్కీ చెప్పారు. 

 కాళేశ్వరం నిర్మాణంలో లక్షల కోట్లు అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన విషయాన్ని ముధు యాష్కీ గుర్తు చేశారు. తాను దోచుకున్న సొమ్మును ప్రజల కోసం ఖర్చు చేయకుండా దేశం మీద పడతావా అంటూ మధు యాష్కీ కేసీఆర్ ను ప్రశ్నించారు.

also read:జాతీయపార్టీపై టీఆర్ఎస్ఎల్పీ తీర్మానం: దసరా నాడే కోఆర్డినేటర్లను ప్రకటించనున్న కేసీఆర్

అక్రమంగా కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించిందని గతంలో బీజేపీ నేతలు విమర్శలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించిందని బీజేపీ నేతలే ఆరోపణలు చేసినప్పుడు ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంపై కూడా కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలున్నాయన్నారు. అయితే లిక్కర్ స్కాం లో అధికారులు కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారన్నారు. అయితే ఆయనను ఈడీ అధికారులు రేపో, ఎల్లుండో అరెస్ట్ చేసే అవకాశం ఉందని మధు యాష్కీ అనుమానం వ్యక్తం చేశారు.