9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే . రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ ఎవరో ప్రజలందరికీ తెలుసునని ఖర్గే ఎద్దేవా చేశారు . ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వాలకు లేదని ఆయన మండిపడ్డారు. 

9 ఏళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం భాగంగా ఆదివారం సంగారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. రూ.5 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రతి ఒక్కరిపై రూ.లక్షన్నర అప్పు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రమని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్‌లో నెహ్రూ, ఇందిరాగాంధీ ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పాలరని ఖర్గే తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో జాతీయ సంస్థలను నెలకొల్పిందని ఆయన వెల్లడించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కాంగ్రెస్ స్థాపించిన సంస్థలతో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నో హామీలను నెరవేర్చిందని ఖర్గే తెలిపారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చే 6 హామీలను తప్పక నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేలు.. 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని ఖర్గే పేర్కొన్నారు. మహిళలకు ప్రతి నెలా ఖాతాల్లో రూ.2,500 వేస్తామని .. వరికి మద్ధతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్ధులకు యువ వికాసం కింద చదువుల కోసం రూ.5 లక్షలు ఇస్తామని ఖర్గే పేర్కొన్నారు. 

ALso Read: రెండు రోజుల్లో వామపక్షాలతో పొత్తులపై స్పష్టత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

మోడీ పాలనలో కార్పోరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ తొమ్మిదేళ్లలో అదానీ ఆదాయం మాత్రమే రెట్టింపు అయ్యిందని ఖర్గే దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బీజేపీకి బీ టీమ్ ఎవరో ప్రజలందరికీ తెలుసునని ఖర్గే ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు భర్తీ చేసి యువతకు మేలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వాలకు లేదని ఆయన మండిపడ్డారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోడీ గొప్పగా చెప్పారని మల్లిఖార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. 

పేదల ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తామని మోడీ అన్నారని.. కేసీఆర్, మోడీలు ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని మల్లిఖార్జున ఖర్గే దుయ్యబట్టారు. అధికారంలోకి రాగానే కేసీఆర్, మోడీలు ఇచ్చిన హామీలు మరిచారని ఆయన మండిపడ్డారు. మోడీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయని.. ఆయన పాలనలో కార్పోరేట్లు మాత్రమే బాగుపడుతున్నారని ఖర్గే ఆరోపించారు.