సోనియా నివాసంలో కీలక భేటీ.. ఏ క్షణమైనా కొత్త టీపీసీసీ చీఫ్ను ప్రకటించే అవకాశం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో జరగనున్న కీలక సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజరుకానున్నారు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నివాసంలో జరగనున్న కీలక సమావేశానికి తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ హాజరుకానున్నారు. సోనియా గాంధీతో జరిగే సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలనే దానిపై నిర్ణయించే అవకాశం వుంది. దీంతో టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరికి దక్కబోతోందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏ క్షణమైనా కొత్త టీపీసీసీ చీఫ్ను అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని సమాచారం.
2018 నుండి కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. కొత్త బాస్ ఎంపిక కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఆశావాహులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ ఎంపిక విషయమై రిపోర్టును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ సోనియాగాంధీకి నివేదికను సమర్పించారు.
Also Read:టీపీసీసీకి కొత్త బాస్: రేవంత్ వైపు ఠాగూర్ మొగ్గు?
పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న నేతలంతా వరుసగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు. భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు ఢిల్లీలో మకాం వేశారు. కేరళ పీసీసీ చీఫ్ ఎంపికను ఇటీవలనే పూర్తి చేసింది కాంగ్రెస్ నాయకత్వం. తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక కూడ పూర్తి చేయనుందనే ప్రచారం సాగుతోంది.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాగూర్ పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు కూడ పీసీసీ చీఫ్ పదవి కోసం చివరి ప్రయత్నంగా ఢిల్లీలో మకాం వేశారనే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది. తన నియోజకవర్గంలో అభివృద్ది పనుల కోసం తాను ఢిల్లీలో ఉన్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెబుతున్నారు. రేవంత్ రెడ్డి కూడ వ్యక్తిగత పనుల కోసమే హస్తినబాట పట్టినట్టుగా ప్రచారంలో ఉంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడ ఢిల్లీలో ఉన్నారు.