సీతారాములపై వ్యాఖ్యలు: పోలీసుల అదుపులో మహేష్ కత్తి
ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తిని హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ చానెల్ లో హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా సీతారాములపై మహేష్ కత్తి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
విశ్వహిందూ పరిషత్ కార్యకర్త కిరణ్ నందన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీసీ 295(1), 505(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహేష్ ను ఆయన ఇంటి వద్ద అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
ఇదిలావుంటే, ఒక సంఘానికి ఏజెంటుగా వ్యవహరిస్తూ హిందువుల మనోభావాల్ని కించపరిచేలా మాట్లాడిన కత్తి మహేష్ ను వెంటనే అరెస్టు చేయాలని శ్రీ పీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేశారు.
కత్తి మహేష్ బరితెగించి, అచ్చోసిన ఆంబోతులా, రాజ్యాంగ విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తెలుగు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం సిగ్గు చేటని ఆయన సోమవారం రాత్రి అన్నారు.
కాగా, కత్తిమహేష్ పై తెలంగాణలోని జనగామ పోలీస్ స్టేషన్లో గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి.