తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ గుప్తాను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ప్రకటించింది. 50 వేలు లంచం తీసుకుంటూ ఆయన ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన సంగతి తెలిసిందే.
తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ రవీందర్ గుప్తాను అరెస్ట్ చేసినట్లు ఏసీబీ ప్రకటించింది. అనంతరం ఆయనను హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపింది. నిజామాబాద్ జిల్లా భీంగల్లో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు రవీందర్ గుప్తా. దీంతో నిర్వాహాకులు ఆయనకు లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ వెంటనే వీసీ నివాసంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గత కొన్నిరోజులుగా తెలంగాణ యూనివర్సిటీ వివాదాలకు కేంద్రంగా వున్న సంగతి తెలిసిందే. వర్సిటీ రిజిస్ట్రార్ నియామకానికి సంబంధించి పాలకమండలి, రవీందర్ గుప్తా మధ్య విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే.
ALso Read: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తెలంగాణ వర్సిటీ వీసీ రవీందర్..
ఇదిలావుండగా.. బుధవారం తెలంగాణ వర్సిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. వేతనాలు కోరుతూ సిబ్బంది, ఆహారం లేక తాము పస్తులుండాల్సి వస్తోందని విద్యార్ధులు నిరసనకు దిగారు. సమస్యలను పరిష్కరించకుంటే రాజీనామా చేయాలని వారు వీసీని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కొందరు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లోని పూలకుండీలను ధ్వంసం చేశారు. దీనికి తోడు వీసీపై అనేక ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేయించినట్లుగా తెలుస్తోంది.
