మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ మ‌రోసారి నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు రేసు కేసులో భాగంగా విచార‌ణకు హాజరుకావాల‌ని నోటీసులో తెలిపారు. 

తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావుకు అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఈ కేసులో కేటీఆర్‌కు నోటీసులు జారీ చేయ‌డం ఇది రెండోసారి. గత నెల 26న ACB అధికారులు నోటీసులు జారీచేయగా, అప్పటికే యూఎస్‌, యూకే పర్యటన షెడ్యూల్ కావడంతో విచారణకు హాజరుకాలేకపోయారు. అయితే తిరిగి వచ్చిన తర్వాత విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేటీఆర్ ప్రకటించారు.

జనవరిలో మొదటి దఫా విచారణ

ఈ కేసులో ACB అధికారులు జనవరి 9న కేటీఆర్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. అదే నెల 8న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌ను, 10న హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించారు. అంతేగాక, గ్రీన్కో కంపెనీకి చెందిన ఏస్ నెక్స్ట్‌జెన్‌ ఎండీ అనిల్ కుమార్‌తో పాటు ఫార్ములా ఈ సంస్థ సీఈవోను వర్చువల్‌గా విచారించారు.

55 కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించి అనుమానాలు

ఫార్ములా ఈ రేసు నిర్వహణలో రూ.55 కోట్ల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం జరిగిందని ACB కేసు నమోదు చేసింది. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ప్రధాన నిందితుడిగా (A1), అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్‌ను (A2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిని (A3) ఎఫ్ఐఆర్‌లో చేర్చింది.

తుది దశ దర్యాప్తు

ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించిన ప్రతిపాదనలు, లండన్ సంస్థలతో ఒప్పందాలు, చెల్లింపులకు సంబంధించిన పత్రాలను ACB అధికారులు సమీకరించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ఆధారంగా కొత్త ప్రశ్నలు సిద్ధం చేశారు. కేటీఆర్ సమాధానాలపై ఆధారపడి కేసును తుది నిర్ణయానికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

క్రాస్ వెరిఫికేషన్

కేటీఆర్ ఇచ్చిన సమాధానాలను ఇతర అధికారులు తోసిపుచ్చినట్టు సమాచారం. దీంతో కొందరిపై మళ్లీ ప్రశ్నలు వేయడం, స్టేట్‌మెంట్లను క్రాస్ వెరిఫై చేశారు. ముఖ్యంగా ఈ రేసు ప్రతిపాదనలు ఎవరు తీసుకువచ్చారు? ప్రభుత్వానికి ఆర్థిక ప్రయోజనం ఏమిటి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.