జార్ఖండ్‌లో గవర్నర్ నుంచి పిలుపు ఆలస్యం కావడంతో అధికార కూటమిలో ఆందోళనలు వెలువడ్డాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ముప్పు ఉన్నదని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి వారిని కాపాడుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే 43 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించింది. 

Jharkhand: జార్ఖండ్‌ అధికార కూటమికి చెందిన 43 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ రాజధానికి చేరుకున్నారు. శుక్రవారం వారు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్‌లో బేగంపేట్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చారు. ఆ తర్వాత వారిని శామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్‌కు తరలించారు. ఈ ఎమ్మెల్యేలందరూ ఫిబ్రవరి 5వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఇక్కడే ఉండనున్నారు. ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్క కేర్‌టేకర్‌ను ఏర్పాటు చేశారు. బీజేపీ కుయుక్తులను అడ్డుకోవడానికే ఈ ఏర్పాట్లు అని టీపీసీసీ వర్గాలు కొన్ని వివరించాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం చోటుచేసుకునే పరిస్థితుల్లో జేఎంఎం సంకీర్ణ కూటమి చాకచక్యంగా వ్యవహరించింది. సీఎంగా హేమంత్ సోరెన్ రాజీనామా చేయగానే.. సీనియర్ లీడర్, మంత్రి చంపయి సోరెన్‌ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. హేమంత్ రాజీనామా అందుకున్న గవర్నర్.. కొత్త సీఎం కోసం జేఎంఎంను పిలుస్తారని ఇన్నాళ్లు ఎదురుచూశారు. గవర్నర్ నుంచి పిలుపురాకపోవడంతో చంపయి సోరెన్ స్వయంగా వెళ్లి గవర్నర్‌ను కలిశారు. సీఎంగా ప్రమాణం చేయడానికి అనుమతించాలని కోరగా.. అందుకు గవర్నర్ సుముఖంగా స్పందించారు. పది రోజుల్లో బలనిరూపణ చేయాలని గవర్నర్ ఆయనకు గడువు విధించారు.

Also Read: KCR: లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ వ్యూహాలు.. గులాబీ దళం టార్గెట్ ఇదే

అయితే, గవర్నర్ స్పందించడం ఆలస్యం కావడంతో బీజేపీ ప్రలోభాలు, ఆకర్ష్ ఆపరేషన్‌లపై అధికార కూటమిలో ఆందోళనలు ఏర్పడ్డాయి. అందుకే జేఎంఎం-కాంగ్రెస్-ఆర్జేడీ సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వెంటనే వారిని రాంచీలోని సర్క్యూట్ హౌజ్‌కు తరలించారు. అయితే, వాతావరణం సానుకూలంగా లేకపోవడంతో వారిని ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు తరలించడం సాధ్యం కాలేదు. అందుకే వారి రాక జాప్యమైంది.