శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం సీజ్: సూట్కేసులో గోల్డ్ స్వాధీనం
బంగారం అక్రమ మార్గంలో విదేశాల నుండి తరలించేందుకు అక్రమార్కులు అనేక ప్రయత్నాలు చేస్తూ చివరికి ఎయిర్పోర్టుల్లో అధికారులకు చిక్కుతున్నారు. దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో ఈ తరహలో నిందితులు కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నారు.
హైదరాబాద్: బంగారం అక్రమ మార్గంలో విదేశాల నుండి తరలించేందుకు అక్రమార్కులు అనేక ప్రయత్నాలు చేస్తూ చివరికి ఎయిర్పోర్టుల్లో అధికారులకు చిక్కుతున్నారు. దేశంలోని అన్ని ఎయిర్పోర్టుల్లో ఈ తరహలో నిందితులు కస్టమ్స్ అధికారులకు చిక్కుతున్నారు. తాజాగా హైద్రాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో కూడ దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడి నుండి కస్టమ్స్ అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు.
దుబాయ్ నుండి వచ్చిన ప్రయాణీకుడు బుధవారం నాడు ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగాడు. తన వెంట తీసుకొచ్చిన సూట్ కేసు అడుగు భాగంలో ప్రత్యేకంగా తయారు చేయించిన ఫ్రేమ్ లో బంగారాన్ని దాచాడు.
ఈ ఫ్రేమ్ పై భాగంలో యధావిధిగా బట్టలను భద్రపర్చాడు.
ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చి ఈ సూట్ కేసును తనిఖీ చేశారు. అడుగుభాగంలో ప్రత్యేకంగా రూపొందించిన ఫ్రేమ్ లో 381 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. దీని విలువ సుమారు రూ. 13.6 లక్షలు ఉంటుందని అంచనా.
ఈ ప్రయాణీకుడిపై అక్రమంగా బంగారం రవాణా కేసు నమోదు చేశారు అధికారులు. ఈ కేుసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రయాణీకుడే బంగారం తీసుకొచ్చాడా లేక ఇతరులెవరైనా ఆయనకు ఈ బంగారం ఇచ్చి పంపారా అనే కోణంలో కూడ కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.