నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా సెగ: 24 మంది ఓటర్లకు కోవిడ్
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న 24 మంది ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కరోనా సెగ తగిలింది. ఈ ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న 24 మంది ప్రజా ప్రతినిధులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
ఈ నెల 9వ తేదీన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.ఈ స్థానంలో 824 మంది ఓటర్లున్నారు. ఈ నెల 9వ తేదీన పోలింగ్ లో వీరింతా పాల్గొనాల్సి ఉంది.దీంతో వీరికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే 24 మంది ప్రజా ప్రతినిధులకు కరోనా సోకిందని తేలింది.
కరోనా సోకని ప్రజా ప్రతినిధులు(ఓటర్లు) తొలుత ఓటు హక్కును నమోదు చేసుకొంటారు. పోలింగ్ సమయం ముగియడానికి ముందు కరోనా సోకిన 24 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
also read:నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు: కవితకు మంత్రి పదవి దక్కేనా?
ఈ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం 50 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరోనా సోకిన ప్రజా ప్రతినిధులు పోస్టల్ బ్యాలెట్ లేదా చివరి గంటలో ఓటు హక్కును వినియోగించుకొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద నాలుగు పీపీఈ కిట్లను ఉంచాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.
ఈ స్థానం నుండి మాజీ ఎంపీ కవిత, కాంగ్రెస్ నుండి సుభాష్ రెడ్డి, బీజేపీ నుండి యెండల లక్ష్మీనారాయణ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 12 వ తేదీన ఈ ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును నిర్వహించనున్నారు.