ఛత్తీస్గఢ్ నారాయణపూర్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమయ్యారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు జరిపిన పెద్ద స్థాయి ఆపరేషన్లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.
ఈ ఆపరేషన్లో బీజాపూర్, నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్స్ (DRG) బలగాలు పాలుపంచుకున్నాయి. మాధ్ అడవుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు గుట్టుచప్పుడు కాకుండా తలదాచుకున్నారన్న సమాచారంతో ఈ ఆపరేషన్ మొదలైంది. భద్రతా దళాలు అడవిలోకి ప్రవేశించిన వెంటనే మావోయిస్టులు కాల్పులకు దిగారు. దీంతో వెంటనే బలగాలు ప్రతిస్పందించాయి.
ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు మరణించగా, మరికొంతమందికి తీవ్రంగా గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన మావోయిస్టుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు కొనసాగుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. కాల్పుల్లో భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం జరగలేదని సమాచారం.
ఇది ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో చోటుచేసుకున్న అతిపెద్ద ఎదురుకాల్పులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. మావోయిస్టులపై భద్రతా బలగాలు కొనసాగిస్తున్న కఠిన చర్యల్లో ఇది ఒక భాగమని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులపై దాడులను మరింత ఉధృతం చేస్తూ ముందుకు సాగుతోంది.