పక్కింట్లో విందు భోజనం.. పదేళ్ల బాలుడికి కరోనా
బాలుడిని పరీక్షించిన వైద్యులు హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు. నిలోఫర్లో బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా..గురువారం పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
పక్కింట్లో విందు భోజననానికి హైదరాబాద్ నుంచి బంధువులు వచ్చారు. దాని వల్ల ఓ పదేళ్ల బాలుడికి కరోనా సోకింది. ఈ సంఘటన నల్గొండలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నల్లగొండ మండలం నర్సింగ్భట్ల గ్రామానికి చెందిన బాలుడు ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధి లక్షణాలతో బాధపడుతుండగా తల్లిదండ్రులు రెండు రోజుల క్రితం నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అతడిని తీసుకువచ్చారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు. నిలోఫర్లో బాలుడికి కరోనా పరీక్షలు నిర్వహించగా..గురువారం పాజిటివ్ రిపోర్టు వచ్చింది.
దీంతో బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. జిల్లా వైద్యశాఖ అధికారులకు సమాచారం రావడంతో వైద్య సిబ్బంది నర్సింగ్భట్ల గ్రామానికి వెళ్లి బాలుడికి సంబంధించిన కుటుంబీకుల 16మంది నమూనాలను సేకరించి, హోంక్వారంటైన్లో ఉండాలని సూచించారు. బాలుడికి కరోనా ఎలా వచ్చిందనే విషయంపై ఆరా తీస్తున్నారు.
ఈ బాలుడు నివాసం ఉంటున్న ఇంటిపక్కవారు ఇటీవల నిర్వహించిన విందు కార్యక్రమానికి హైదరాబాద్ వాసులు హాజరయ్యారు. బాలుడు ఈ శుభకార్యంలో పాల్గొని విందు భోజనం చేశాడని స్థానికులు చెబుతున్నారు. దానివల్లే బాలుడికి కరోనా వచ్చిందని అనుమానిస్తున్నారు.