వాట్సప్‌ కొత్తగా వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను అన్ని గ్రూపులకు విస్తరించింది. గ్రూప్‌ సభ్యుల సంఖ్యపై ఆ పరిమితి తొలగించింది.

వెంటనే మెసేజులు పంపాలన్నా..అప్పటికప్పుడు ఫొటోలను పంచుకోవాలన్నా వెంటనే ఉపయోగించే ఫ్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్‌డేట్లను యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. ఈ క్రమంలోనే గ్రూప్‌ కాల్స్‌ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన వాయిస్‌ చాట్స్‌ఫీచర్‌ని తాజాగా మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఎక్కువ సభ్యులున్న గ్రూపులకు మాత్రమే పరిమితమైన ఈ సేవలు ఇకపై అన్ని గ్రూపులకు వినియోగంలోకి రానుంది.

గ్రూప్‌లోని వ్యక్తులు ఎవరైనా..

వాట్సప్‌ తొలుత వాయిస్‌ చాట్‌ ఫీచర్‌ను 33 మంది కంటే ఎక్కువ సభ్యులున్న గ్రూపులకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని గ్రూపులకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. గ్రూప్‌లోని వ్యక్తులు ఎవరైనా ఈ ఫీచర్‌ని వినియోగించుకోవచ్చని పేర్కొంది. గ్రూప్‌ చాట్‌ ఓపెన్‌ చేసి కింద నుంచి స్వైప్‌ చేస్తే Swipe up to chat అనే ఆప్షన్‌ కనపడుతుంది.

దాన్ని కొన్ని సెకన్ల పాటు హోల్డ్‌ చేస్తే వాయిస్‌ చాట్స్‌ ఫీచర్‌ పెట్టుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. మిగిలిన వారికి కూడా రానున్న రోజుల్లో అందుబాటులోకి రానుంది.సాధారణంగా ఉండే గ్రూప్‌ కాల్స్‌కు ఈ ఫీచర్‌ కాస్త భిన్నం. వాట్సప్‌ గ్రూప్‌ కాల్‌ వస్తే.. సాధారణంగా గ్రూప్‌లోని సభ్యులందరికీ నోటిఫికేషన్‌తో పాటు రింగ్‌టోన్‌ కూడావస్తుంది. కానీ ఈ కొత్త ఫీచర్‌ సాయంతో వాట్సప్‌ నుంచి గ్రూప్‌ కాల్స్‌ వస్తే ఎలాంటి రింగ్‌ రాదు,వినపడదు.

గ్రూప్‌లోని సభ్యులందరికీ కేవలం సైలెంట్‌ నోటిఫికేషన్‌ మాత్రమే స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. దీంతో వాయిస్‌ చాట్‌లో పాల్గొనాలనుకొనేవారు కాల్‌ ముగిసేలోగా ఎప్పుడైనా జాయిన్‌ అవ్వొచ్చు. వాయిస్‌ చాట్‌లో పాల్గోని వారు కూడా కాల్‌లో పాల్గొన్నవారి ప్రొఫైల్‌ను చూడొచ్చు. అంతేకాదు ఇందులో వాయిస్ చాట్‌ల్లోనూ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో తీసుకొచ్చింది.