ఇక ఆర్టీజీసీ, నెఫ్టీ సేవలు మరింత చౌక
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి సోమవారం నుంచి ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ బదిలీలపై చార్జీలు రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
ముంబై: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆర్బీఐ మరో అడుగు వేసింది. ఇందులో భాగంగా ఇకపై నగదును పెద్దమొత్తంలో బదిలీ చేయడానికి వినియోగించే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టీజీఎస్), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (నెఫ్ట్) ఛార్జీలను రద్దు చేసింది. ఇది జూలై ఒకటో తేదీనుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించింది. బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని తప్పక తమ కస్టమర్లకు అందించాలని కూడా ఆదేశించింది. ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలు నిర్వహించినప్పుడు ఆర్బీఐ బ్యాంకుల నుంచి వసూలు చేసే ప్రాసెసింగ్ చార్జీలు, టై వెరీయింగ్ చార్జీలు ఎత్తివేసిన నేపథ్యంలో ఆమేరకు భారం తగ్గనుంది.
ఆర్టీజీస్లో అయితే ఎక్కువ మొత్తంలో, నెఫ్ట్ విధానంలో 2 లక్షల వరకు నగదును బదిలీ చేసుకోవచ్చు. గతంలో ఆర్టీజీఎస్ పద్ధతిలో సొమ్ము బదిలీకి రూ.5 నుంచి రూ.50, నెఫ్ట్ పద్ధతిలో రూ.1 నుంచి రూ.5 వసూలు బ్యాంకులు వసూలు చేసేవి. ఈ చర్యతో డిజిటల్ బ్యాంకు లావాదేవీలు మరింత పెరిగే అవకాశం ఉందని ‘భారత బ్యాంకు సమాఖ్య’ ఛైర్మన్ సునీల్ మెహతా పేర్కొన్నారు.
ఏటీఎం ఛార్జీలను కూడా తగ్గించే ఉద్దేశంతో దాని అమలుకు సాధ్యసాధ్యాల పరిశీలనకు ఐబీఎ ముఖ్యాధికారి వి.జి కన్నన్ నేతృత్వంలో ఒక కమిటీని ఆర్బీఐ వేసింది. ప్రస్తుతం ఏటీఎంల వినియోగం గణనీయంగా పెరిగింది. మరోవైపు ఈ లావాదేవీలపై విధించే ఛార్జీలను తగ్గించాలనే డిమాండ్ కూడా పెరిగింది.