టెలికం సంస్థల మధ్య ప్రతి ఫోన్ కాల్‌కు ఇంటర్ కనెక్ట్ యూసేజీ చార్జీలను వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిగా రద్దు చేయాలని ట్రాయ్‌ను రిలయన్స్ జియో కోరింది. లేకపోతే అందుబాటు ధరల్లో వినియోగదారులకు సేవలందించడం కష్టమేనని జియో డైరెక్టర్ మహేంద్ర నహతా పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: టెలికం సంస్థల మధ్య ఇంటర్‌కనెక్ట్‌ యూసేజీ చార్జీల (ఐయూసీ) విధానాన్ని 2020 జనవరిలోగా ఎత్తివేయకుంటే అందుబాటు రేట్లలో టెలికం సేవలను అందించడంపై ప్రతికూల ప్రభావం పడుతుందని రిలయన్స్‌ జియో తెలిపింది. ప్రస్తుతం ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ నిష్పత్తి దాదాపు సరి సమాన స్థాయిలో ఉంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read శామ‌సంగ్‌కు పోటీ: సరికొత్తగా విపణిలోకి మోటో ఫోల్డబుల్ ఫోన్

ఈ కారణంతో ఐయూసీ ఎత్తివేతను వాయిదా వేయడం సరికాదని జియో డైరెక్టర్‌ మహేంద్ర నహతా పేర్కొన్నారు. ఐయూసీపై టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ అభిప్రాయాలు తెలిపారు. జియో డైరెక్టర్ మహేంద్ర నహతా అభిప్రాయాలను వొడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌టెల్‌ సంస్థలు వ్యతిరేకించాయి.

ఐయూసీని సున్నా స్థాయికి తగ్గించేయరాదని, దీన్ని పూర్తిగా తొలగించే బిల్‌ అండ్‌ కీప్‌ (బీఏకే) విధానం అమలును మూడేళ్ల దాకా వాయిదా వేయాలని ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా కోరాయి. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి వచ్చే కాల్స్‌ను అందుకున్నందుకు ఆపరేటర్లు పరస్పరం చెల్లించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇది నిమిషానికి 6 పైసలుగా ఉంది. 

also read స్మార్ట్ ఫోన్లకు అప్ డేట్ గా కొత్త ఆండ్రాయిడ్ ఓఎస్...

2020 జనవరి నుంచి దీన్ని పూర్తిగా ఎత్తివేయాలని ముందుగా నిర్ణయించినా, ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగించే అంశాన్నీ ట్రాయ్‌ పరిశీలిస్తోంది. టెలికం రంగంలో తీవ్ర సంక్షోభం గురించి ప్రభుత్వానికి తెలుసనే భావిస్తున్నామని, త్వరలోనే కేంద్రం ఊరట చర్యలేవైనా ప్రకటించవచ్చని ఆశిస్తున్నామని ఇన్వెస్టర్లతో సమావేశంలో వొడాఫోన్‌ ఐడియా పేర్కొంది.