సర్కార్ జోక్యం లేకుండానే ఎండీఆర్ జీరో కావాలి: నందన్ నీలేకని
ప్రభుత్వ జోక్యం లేకుండానే మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీలు జీరో కావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకని సూచించారు. ఇవి చిరువ్యాపారులకు ప్రయోజనకరంగా ఉంటాయని వ్యాఖ్యానించారు. ఆన్ లైన్తోపాటు ఆఫ్ లైన్లోనూ చౌకగా చెల్లింపులు జరుగాల్సి ఉన్నదని చెప్పారు.
మర్చంట్ డిస్కౌంట్ ఛార్జీలు ప్రభుత్వ జోక్యం లేకుండానే జీరో కావాల్సిన అవసరం ఉన్నదని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని సూచించారు. ప్రభుత్వం జోక్యం లేకపోయినా.. దేశీయ పేమెంట్ సంస్థలు చౌక చెల్లింపు విధానాలపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఇవి చిరు వ్యాపారులకు ప్రయోజనకరమని తెలిపారు.
‘ఎండీఆర్ ఛార్జీలు పూర్తిగా తొలగిస్తారని అనుకుంటున్నాను. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోయినా ఇది జరగాలి. ఆన్లైన్లోనే కాదు.. ఆఫ్లైన్లోనూ చౌకగా చెల్లింపులు జరిగేలా చూడాలి. అప్పులివ్వడం వంటి ఇతర మార్గాల్లో ఆదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాలి. యూపీఐని తప్పనిసరి చేయడం ఉత్తమమైన మార్గమని అనుకుంటున్నాను. యూపీఐ విషయంలో ఆకాశమే హద్దు’ అని ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నిలేకని పేర్కొన్నారు.
వ్యాపారులు బ్యాంకుల చెల్లింపుల వ్యవస్థను వినియోగించుకొన్నందుకు ఎండీఆర్ ఛార్జీలను వసూలు చేస్తుంది. భారత ప్రభుత్వం రూపే కార్డు నెట్వర్క్ను ఉపయోగించి చేసే చెల్లింపులపై ఛార్జీలను రద్దు చేసింది. డిజిటల్ పేమెంట్స్ను ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం తమ వ్యాపార లాభదాయకతపై ప్రభావం చూపిస్తాయని పలు బ్యాంకులు వాపోతున్నాయి.