డేటా యూసేజీ యమ స్పీడ్.. ఒక్కొక్కరూ నెలకు 11జీబీ నెట్ వాడకం
డేటా వినియోగం శరవేగంతో పెరుగుతున్నది. దీనికి డేటా టారిఫ్స్, స్మార్ట్ఫోన్ ధరలు తగ్గడమే కారణం అని నోకియా మొబైల్ బ్రాడ్ బాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ పేర్కొంది. సగటున ఒక్కొక్కరు 11 జీబీ ర్యామ్ డేటా వినియోగిస్తున్నారని వెల్లడించింది.
చౌకగా డేటా ప్లాన్లు, అఫర్డబుల్గా స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, వీడియో సర్వీసులు, 4జీ నెట్వర్క్కు ప్రజాదరణ పెరగడంతో… భారతదేశంలో డేటా వినియోగం బాగా పెరిగింది. ఒక్కో వినియోగదారుడు సగటున వాడే డేటా నెలకు 11జీబీ రామ్స్కి పెరిగినట్టు టెలికాం గేర్ మేకర్ నోకియా వెల్లడించింది.
నోకియా తన యాన్యువల్ మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండియా ట్రాఫిక్ ఇండెక్స్ (ఎంబీఐటీ) నివేదికలో ఈ సంగతిని బయటపెట్టింది. 4జీ వినియోగం పెరగడంతో మొత్తం మీద 2019లో డేటా ట్రాఫిక్ 47 శాతం పెరిగినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా మొత్తం డేటా ట్రాఫిక్లో 4జీ డేటావినియోగం 96 శాతంగా ఉంది. 3జీ డేటా ట్రాఫిక్ భారీగా 30 శాతం వరకు పడిపోయిందని ఈ నివేదికలో నోకియా వివరించింది.
‘ఒక్కో యూజర్ సగటును నెలకు వాడే డేటా డిసెంబర్ నెలలో 11గిగాబైట్స్ (11జీబీ)కి పెరిగింది. 4జీ నెట్ వర్క్ అప్గ్రెడేషన్ పెరగడంతో పాటు తక్కువ ధరలకు డేటా అందుబాటులోకి రావడం, అఫర్డబుల్గా స్మార్ట్ఫోన్లు లభ్యం కావడం, వీడియోలకు పెరిగిన ప్రజాదరణతో డేటా వాడకం పెరిగింది’ అని నోకియా ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా చెప్పారు.
ఇండియాలో డేటా వినియోగం ప్రపంచంలో కెల్లా అత్యధికంగా ఉందని నోకియా ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ మార్వా తెలిపారు. చైనా, అమెరికా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ, స్పెయిన్ వంటి మార్కెట్లను ఇండియా దాటేసిందని వెల్లడించారు.
ఒక జీబీ డేటా రూ.7కే ఒక జీబీ డేటాతో యూజర్లు 200 సాంగ్స్ లేదా గంట పాటు నిరంతరంగా వీడియోలను చూసుకోవచ్చు. అయితే కంటెంట్ క్వాలిటీ (ఎస్డీ, హెచ్డీ, ఆల్ట్రా హెచ్డీ) బట్టి ఎంత మొత్తంలో డేటాను వినియోగిస్తారో ఆధారపడి ఉంటుంది.
ఆశ్చర్యకరంగా భారతదేశంలో బ్రాడ్ బ్యాండ్ పెనట్రేషన్ 47 శాతంగా ఉంది. ఇది చైనా(95 శాతం), ఇతర యూరప్ దేశాల (95–115శాతం) కంటే తక్కువగా ఉంది. మొబైల్ డేటా వాడకం ఇండియాలో మరింత పెరుగుతుందని మార్వా చెప్పారు.
ఇండియాలో డేటా ధరలు ఒక జీబీకి రూ.7గా ఉన్నట్టు నోకియా నివేదిక తెలిపింది. అలాగే 4జీ డేటా యూజర్లు 59.8 కోట్లు, 3జీ డేటా యూజర్లు 4.4 కోట్లు అని అంచనా వేసింది.
దేశంలో వీడియో వినియోగం బాగా పెరుగుతోంది. డేటా చౌకగా లభ్యం కావడంతో ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఇతర రీజనల్ కంటెంట్ ప్లాట్ఫామ్స్ మార్కెట్లో జోరుగా సాగుతున్నాయి. ఇండియన్ యూజర్లు ఓటీటీ ప్లాట్ఫామ్స్పై రోజుకు వెచ్చించే యావరేజ్ టైమ్ 70 నిమిషాలుగా ఉంటోంది.
ఒక్కో సెషన్ యావరేజ్గా 40 నిమిషాల వరకు ఉంటుందని నోకియా నివేదిక వెల్లడించింది. 4జీకి సబ్ స్క్రయిబర్లు మైగ్రేట్ అవుతుండటంతో, బ్రాడ్ బ్యాండ్ గ్రోత్ పెరుగుతుందని మార్వా తెలిపారు. అప్కమింగ్ 4కే/8కే వీడియోలు, ఇండస్ట్రీ 4.0 సొల్యుషన్లు ఇండస్ట్రీల ప్రొడక్టివిటీని పెంచనున్నట్టు చెప్పారు.
4జీ హ్యాండ్సెట్ డివైజ్ల సంఖ్య 2019లో 1.5 రెట్లు పెరిగి, 50.1 కోట్ల యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇవి 33 కోట్లుగా ఉన్నాయి. వాయిస్ ఓవర్ ఎల్టీఈ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్లు 43.2 కోట్లుగా ఉన్నాయి. ఇనోవేటివ్ ఇండస్ట్రీ 4.0 యూజ్ కేసులు దేశంలో ప్రైవేట్ ఎల్టీఈని పెంచనున్నాయని నివేదిక చెప్పింది. ఇండియాలోని సంస్థలకు ప్రైవేట్ ఎల్టీఈని ఆఫర్ చేసేందుకు ఇటీవలే నోకియా, ఎయిర్ టెల్తో భాగస్వామ్యమైంది.