ఆఫీసుల్లో రెట్టింపు మహిళలు.. ఐదేళ్లలో ఫేస్బుక్ లక్ష్యాలివే
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. అలాగే తమ భవిష్యత్ కార్యాచరణ నివేదికనూ బయటపెట్టింది.
శాన్ ఫ్రాన్సిస్కో: ఈనాటి మోడర్న్ ప్రపంచంలో పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ వివిధ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల సంఖ్యను రెండింతలు చేసేందుకు ప్రముఖ సోషల్ మడియా దిగ్గజం ఫేస్బుక్ ప్రణాళికలు రచిస్తోంది.
అంతేకాక సంస్థ నిర్దేశించుకున్న వైవిధ్యమైన లక్ష్యాల్లో భాగంగా అమెరికాలో నల్లజాతీయులు, స్పానిష్ మూలాలు ఉన్న (హిస్పానిక్) ఉద్యోగుల సంఖ్యను సైతం రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టకుంది. 2024 నాటికి అమెరికాలోని ఫేస్బుక్ కార్యాలయాల్లో సగానికిపైగా స్థానిక మైనారిటీ (తక్కువ ప్రాతినిధ్యం) వర్గాలకు చెందిన ఉద్యోగులను నియమించాలనే ఆలోచనలో ఉంది.
‘వచ్చే ఐదేళ్లలో మా శ్రామికశక్తిలో కనీసం 50 శాతం మహిళలు, నల్లజాతీయులు, హిస్పానిక్, స్థానిక అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులు, ప్రత్యేక ప్రతిభావంతులు (దివ్యాంగులు), సీనియర్ సిటిజెన్స్ ఉండేలా కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని ఫేస్బుక్ చీఫ్ డైవర్సిటీ అధికారి మాక్సిన్ విలియమ్స్ తన బ్లాగ్లో పేర్కొన్నారు.
ఫేస్బుక్ తన వార్షిక నివేదికతో పాటుగా రానున్న అయిదేళ్లలో సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల నివేదికలను విడుదల చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం ఉద్యోగుల్లో 36.9 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నట్లు సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది.
సీనియర్ లీడర్షిప్ స్థాయిలో 32.6 శాతం, సాంకేతికపరమైన విభాగాల్లో 23 శాతం మహిళా ఉద్యోగులు ఉన్నారన్నది. మరోవైపు మొత్తం శ్రామికశక్తిలో నల్లజాతీయులు 3.8 శాతం, హిస్పానిక్స్ 5.2 శాతంగా ఉన్నారు.