Asianet News TeluguAsianet News Telugu

టిక్‌టాక్‌పై నిషేధం: 'డబ్ షూట్' యాప్‌ను రూపొందించిన హైద్రాబాద్ సంస్థ

సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి చర్య తీసుకున్న కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్‌తో సహా 59 డ్రాగన్ యాప్స్‌ను నిషేధించింది. ఈ క్రమంలో దేశీయ యాప్స్ మీద వినియోగదారులు కేంద్రీకరించారు. 

Dub Shoot for Dragon app 'tik tok'
Author
Hyderabad, First Published Jul 5, 2020, 12:03 PM IST

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి చర్య తీసుకున్న కేంద్ర ప్రభుత్వం టిక్ టాక్‌తో సహా 59 డ్రాగన్ యాప్స్‌ను నిషేధించింది. ఈ క్రమంలో దేశీయ యాప్స్ మీద వినియోగదారులు కేంద్రీకరించారు. 

మొబైల్ యాప్ రూపకర్తలు సరికొత్త యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయంగా ‘డబ్ షూట్’ అనే యువతను భారతీయ యాప్ ఆకట్టుకుంటున్నది. 

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన ‘ఎం టచ్’ ల్యాబ్స్ ఈ ‘డబ్ షూట్’ యాప్‌ను తయారుచేసింది. టిక్ టాక్ వంటి చైనా యాప్‌లపై నిషేధం తర్వాత దేశీయంగా తయరైన ప్రత్యామ్నాయ యాప్‌ల డౌన్ లోడ్‌లు పెరిగాయి.

ఈ నేపథ్యంలో దేశీయ యాప్ ‘డబ్ షూట్’ను వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నిర్ణయం మీద సర్వత్ర హర్షం వ్యక్తం అవుతోంది.

చాలా మంది చైనా యాప్స్‌కు బదులు  భారతీయ యాప్స్ వాడుతున్నారు. అలాంటి యాప్స్‌లో డబ్ షూట్ కూడా ఒకటి. ఇప్పటికే ఈ యాప్ 50 లక్షల యూజర్లను దాటిపోయింది. గతవారం నుంచి డౌన్ లోడ్స్ సంఖ్య గణనీయంగా ఉందని డబ్ షూట్ సీఈఓ పీ వెంకటేశ్వరరావు తెలిపారు. 

ఇదిలా ఉండగా భారత ప్రభుత్వం నిషేధించడంతో టిక్ టాక్ యాప్ నష్టపోయింది.  ఈ క్రమంలో పలు చైనా కంపెనీలు తీవ్రమైన నష్టాన్ని చవి చూస్తున్నాయి.  చైనా వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం టిక్‌టాక్, విగో వీడియో, హలో వంటి చైనా యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన వాటి  మాతృ సంస్థ ‘బైట్‌డాన్స్‌’కు ఘోరమైన దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. 

టిక్ టాక్ సంస్థ ఇప్పటివరకు దాదాపు 600 కోట్ల డాలర్ల వరకు నష్టపోయినట్లు ‘గ్లోబల్‌ టైమ్స్‌’ నివేదిక తెలిపింది. గత కొన్ని సంవత్సరాల్లో, బైట్‌ డాన్స్‌ కంపెనీ దాదాపు 100 కోట్ల డాలర్లకు పైగా భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిందని పేర్కొంది.  

మొబైల్ యాప్స్‌ విశ్లేషణ సంస్థ ‘సెన్సార్ టవర్’ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, టిక్‌టాక్‌ను భారతదేశంలో మే నెలలో 112 మిలియన్ సార్లు డౌన్‌లోడ్ చేసుకున్నారని గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో తెలిపింది. ఇది భారత మార్కెట్లో 20 శాతం అని పేర్కొంది. ఈ సంఖ్య అమెరికాలో డౌన్‌లోడ్‌ చేసుకున్న దాని కంటే  రెట్టింపు అని గ్లోబల్ టైమ్స్ తన నివేదికలో పేర్కొంది. 

భారతదేశంలో 59 యాప్‌లను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం జూన్ 29వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు వినియోగదారుల డేటాను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న కొన్ని మొబైల్ యాప్స్‌ ద్వారా అందిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ యాప్స్‌‌పై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios