‘విశాఖ’ టెస్టుపై భారత్ పట్టు
- రెండో టెస్టులో అదరగొట్టిన టీం ఇండియా
- పుజారా, కొహ్లీ సెంచరీల మోత
- 317 పరుగులతో పటిష్ట స్థితిలో భారత్
స్టీల్ సిటీలో కొహ్లీ సేన ఇరగదీసింది. సెంచరీలతో అదరగొట్టింది. మొదటిసారిగా టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చిన విశాఖ స్టేడియంలో భారత్ రాణించడంతో అభిమానులు పండగా చేసుకున్నారు.
ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో ఆతిధ్య భారత జట్టు మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 317 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి పటిష్ట స్ధితిలో నిలిచింది.
అయితే ఇన్నింగ్స్ ఆరంభంలో ఓపెనర్లు తడబడ్డారు. లోకేష్ రాహుల్ డక్ అవుట్ కాగా, మురళీ విజయ్(20) మరోసారి నిరాశపరిచాడు. ఓపనర్లు శుభారంభాన్ని అందించలేకపోయినా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టెస్టు మ్యాచ్ స్పెషలిస్ట్ ఛటేశ్వర పుజారా(119) తన దైన స్టైల్ లో ఇంగ్లాండ్ బౌలర్ల భరతం పట్టాడు. తన సహజ శైలికి భిన్నంగా సిక్సర్ కొట్టి సెంచరీ చేశాడు.
పుజారా ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానే(23) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు.
తొలి రోజు ఆట మరో పదిహేను నిమిషాల్లో ముగుస్తుందనగా రహానే వెనుదిరగడం భారత్ కు దెబ్బే. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్(1)తో జతకలిసిన కోహ్లీ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా.. స్టువర్ట్ బ్రాడ్ కు ఒక వికెట్ దక్కింది.