హాయిగా బ్రేక్ తీసుకుంటా: సిరీస్ విజయం తర్వాత కోహ్లీ
హాయిగా బ్రేక్ తీసుకుంటా: సిరీస్ విజయం తర్వాత కోహ్లీ
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ మీద జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను గెలుచుకోవడం వల్ల తాను సంతోషంగా బ్రేక్ తీసుకుంటానని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.
చివరి రెండు వన్డేల నుంచి ఆయన తప్పుకుంటున్న విషయం తెలిసిందే. కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ మూడో వన్డే విజయం తర్వాత ఆ మాట అన్నాడు.
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేస్తుందని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. చివరి రెండు వన్డేల్లోనూ తాము విజయం సాధిస్తామని ఆయన అన్నాడు.
చాలా రోజుల నుంచి బ్రేక్ తీసుకోలేదని, ఆస్ట్రేలియా పర్యటనతో ఊపిరి సలపకుండా గడిపానని, అందుకే విరామం తీసుకుంటున్నానని వివరించాడు.
విరామ సమయాన్ని బాగా గడుపుతానని, ఎవరో ఒకరు తన స్థానాన్ని భర్తీ చేస్తారని, మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుందని అన్నాడు.
న్యూజిలాండ్లో వన్డే సిరీస్ గెలవడం పట్ల విరాట్ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నామని చెప్పాడు.
మూడో వన్డే చివర్లలో అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ బాగా బ్యాటింగ్ చేశారని కొనియాడాడు. డ్రెసింగ్ రూములో కూర్చుని ప్రతి పరుగుకు కేరింతలు కొట్టామని చెప్పాడు.
ఆటగాళ్లు అందరూ తమ ప్రతిభపై నమ్మకం ఉంచి, దాన్ని మైదానంలో ప్రదర్శించడంతో విజయాలు దక్కాయని అన్నాడు.