భారత్ నుంచి ఒకే ఒక్కడు.. కోహ్లీ
తాజా జాబితా విడుదల చేసిన ఫోర్బ్స్
ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో భారత్ నుంచి కేవలం ఒకే ఒక్కరు చోటు దక్కించుకున్నారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. టీం ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ.
22 దేశాలకు చెందిన ఆటగాళ్లు టాప్-100లో నిలిచారు. అత్యధికంగా అమెరికా నుంచి 66 మంది క్రీడాకారులు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది జూన్ 1 మధ్య ఆటగాళ్లు పొందిన ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఫోర్బ్స్ ఈ జాబితాను ప్రకటించింది.
24 మిలియన్ల డాలర్ల ఆదాయంతో ఫోర్బ్స్ జాబితాలో కోహ్లీ 83వ స్థానంలో నిలిచాడు. 4 మిలియన్ల డాలర్లను జీతంగా అందుకుంటున్న కోహ్లీ మిగతా 20 మిలియన్ డాలర్లను వాణిజ్య ఒప్పందాల ద్వారా సంపాదిస్తున్నాడు.
అమెరికాకు చెందిన బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయడ్ మేవెదర్ 285 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ(111 మిలియన్ డాలర్లు), పోర్చుగల్ ఫుట్బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో(108 మిలియన్ డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
గత ఏడేళ్లల్లో ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో ఫ్లాయడ్ అగ్రస్థానం దక్కించుకోవడం ఇది నాలుగోసారి. గత ఏడాది 22 మిలియన్ డాలర్ల ఆదాయంతో 89వ స్థానంలో నిలిచిన కోహ్లీ ఈ ఏడాది తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకున్నాడు.