టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్‌ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరఫున నిశాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

దేశ చరిత్రలో ఐదోసారి భారత్ అండర్-19 ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. 2022 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇంతకుముందు టీమ్ ఇండియా 2000, 2008, 2012, 2018లో ప్రపంచకప్ గెలిచింది. అదే సమయంలో 2006, 2016, 2020లో భారత జట్టు ఫైనల్‌లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది.

జేమ్స్ ర్యూ అత్యధికంగా 95 పరుగులు చేశాడు.  భారత్ ఆటగాడు రాజ్ బావా ఐదు వికెట్లు, రవికుమార్ నాలుగు వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అలాగే నిశాంత్ సింధు 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంతేకాకుండా షేక్ రషీద్ కూడా 50 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 48వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన దినేష్ బానా టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు.

భారత జట్టు పేరిట రికార్డు 
భారత జట్టు రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్ చేరింది. అండర్-19లో ఏ జట్టు కూడా ఇన్ని సార్లు ప్రపంచకప్‌లో ఫైనల్ చేరలేదు. అలాగే ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు వరుసగా నాలుగో ఫైనల్ మ్యాచ్ కూడా. అత్యధికంగా ఐదు ప్రపంచకప్‌లు గెలిచిన జట్టుగా కూడా భారత జట్టు రికార్డు సృష్టించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా మూడుసార్లు ఈ టైటిల్‌ను గెలుచుకుంది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. గ్రూప్ స్టేజ్ నుంచి ఇప్పటి వరకు టోర్నీలో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టు విజయం సాధించింది.

ప్రత్యేక క్లబ్‌లో యశ్ ధుల్
అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు నాయకత్వం వహించిన కెప్టెన్ల ప్రత్యేక జాబితాలో యశ్ ధుల్ కూడా చేరాడు. అతని కంటే ముందు మహ్మద్ కైఫ్ (2000), విరాట్ కోహ్లి (2008), ఉన్ముక్త్ చంద్ (2012), పృథ్వీ షా (2018) కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచింది. అంతే కాకుండా రవికాంత్ శుక్లా (2006), ఇషాన్ కిషన్ (2016), ప్రియమ్ గార్గ్ (2020) కెప్టెన్సీలో భారత జట్టు ఫైనల్‌లో ఓడిపోయింది.

మ్యాచ్ గురించి మాట్లాడితే మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు చెత్త ఆరంభాన్ని  చేసింది. ఇంగ్లండ్‌లోని ఆరుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును కూడా అందుకోలేకపోయారు. కెప్టెన్ టామ్ ప్రెస్, జార్జ్ బెల్, థామస్ ఆస్పిన్‌వాల్‌లతో సహా ముగ్గురు బ్యాట్స్‌మెన్ సున్నాకి ఔటయ్యారు. దీంతో ఇంగ్లండ్  జట్టు 61 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. జార్జ్ థామస్ 27 పరుగులు, జాకబ్ బెతెల్ 2 పరుగులు, విలియం లాక్టన్ 4, రెహాన్ అహ్మద్ 10 పరుగులు మాత్రమే చేయగలిగారు.

భారత్, ఇంగ్లండ్ జట్లు 
భారత్, ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య ఈ మ్యాచ్ ​​50వ మ్యాచ్. ఇందులో 37 మ్యాచుల్లో భారత్‌, 11 మ్యాచుల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించాయి. ఒక మ్యాచ్ టై అయింది. అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌ రికార్డు కూడా అద్భుతంగా ఉంది. ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఏడింటిని భారత్‌ గెలుచుకోగా, రెండు ఇంగ్లండ్‌ గెలిచింది.