Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భారత షూటర్లు మనీష్, సింగ్ రాజ్... గోల్డ్, సిల్వర్ కైవసం
50 మీటర్స్ షూటింగ్ మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ లో భారత షూటర్లు మనీష్ నర్వాల్, సింగ్ రాజ్ ఆదానలు స్వర్ణ, రజత పతకాలను సాధించారు.
భారత షూటర్లు టోక్యోలో అదరగొడుతున్నారు. 50 మీటర్స్ షూటింగ్ మిక్స్డ్ పిస్టల్ ఈవెంట్ లో భారత షూటర్లు మనీష్ నర్వాల్, సింగ్ రాజ్ ఆదానలు స్వర్ణ, రజత పతకాలను సాధించారు. ఉదయం జరిగిన క్వాలిఫయర్స్ లో ఫైనల్ లోకి ప్రవేశించిన భారత స్టార్ పారా షూటర్లు... ఉత్కంఠభరిత పోరులో తొలి రెండు స్థానాల్లో నిలిచి గోల్డ్, సిల్వర్ లను సాధించారు.
తొలి నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన సింగ్ రాజ్... మధ్యలో కొన్ని బాడ్ షాట్స్ వల్ల కిందకు పడిపోయాడు. మరోవైపు మనీష్ నర్వాల్ ప్రారంభంలో తప్పులు చేస్తూ వచ్చాడు. కానీ అనూహ్యంగా పుంజుకున్న మనీష్ గోల్డ్ తో ముగించగా.. సింగ్ రాజ్ సిల్వర్ మెడల్ తో సంతృప్తి చెందాడు.
మనీష్ నర్వాల్ గోల్డ్ సాధించడంతో అవని లేఖరా తరువాత షూటింగ్ లో గోల్డ్ సాధించిన మరో టీనేజర్ గా 19 ఏండ్ల మనీష్ నర్వాల్ నిలిచాడు. మంగళవారం నాడు జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్ లో సింగ్ రాజ్ ఆదాన ఇప్పటికే కాంస్యం సాధించాడు. దీనితో ఈ ఒలింపిక్స్ లో రెండవ మెడల్ ని నేడు సాధించాడు.
ఇక నేడు టోక్యోలో వివిధ ఈవెంట్లలో భారత పారా అథ్లెట్లు పతకాల పంటను పండిస్తూనే ఉన్నారు. బాడ్మింటన్ లో సుహాస్ యతిరాజ్, ప్రమోద్ భగత్ లు ఫైనల్స్ లోకి ప్రవేశించి ఇప్పటికే రెండు పతకాలను ఖాయం చేయగా... మరో ఇద్దరు ప్లేయర్స్ తరుణ్, మనోజ్ సర్కార్ లు కాంస్యాల కోసం పోరాడనున్నారు.