Tokyo Olympics: జావెలిన్ త్రో ఫైనల్స్ లోకి దూసుకెళ్లిన నీరజ్ చోప్రా
భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్స్ లోకి దూసుకెళ్లాడు. తన తొలి ప్రయత్నంలోనే క్వాలిఫికేషన్ మార్కును ధాటి 7వ తేదీన జరిగే ఫైనల్స్ కి అర్హత సాధించాడు.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫైనల్స్ లోకి ప్రవేశించాడు. తన తొలి అటెంప్ట్ లోనే 83.05 క్వాలిఫికేషన్ మార్క్ ను ధాటి 86.65 మీటర్ల దూరానికి జావెలిన్ ని విసిరి డైరెక్ట్ గా ఫైనల్స్ కి అర్హత సాధించడమే కాకుండా గ్రూప్- ఏ లో టాపర్ గా నిలిచాడు.
జావెలిన్ ని అందుకున్న నీరజ్ పూర్తి కాన్ఫిడెన్స్ తో జావెలిన్ ని తొలి ప్రయత్నంలోనే క్వాలిఫికేషన్ మార్క్ ఆవల విసిరి నేరుగా అర్హత సాధించాడు. మూడు ప్రయత్నాలు ఉన్నప్పటికీ... క్వాలిఫికేషన్స్ లో క్వాలిఫై అయిన తర్వాత మిగిలిన రెండు అటెంప్ట్ లలో పాల్గొనాల్సిన అవసరం లేకపోవడంతో ఫీల్డ్ నుంచి తన బాగ్ వేసుకొని రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆగస్టు 7న జావెలిన్ ఫైనల్స్ లో నీరజ్ పోటీపడనున్నాడు.
23 సంవత్సరాల నీరజ్ జర్మనీకి చెందిన ప్రపంచ ఛాంపియన్ వెట్టెర్ ని తోసిరాజేసి గ్రూప్ లో అందరికంటే ముందున్నాడు. ఒకానొక దశలో ఒలింపిక్స్ లో తనను ఓడించడం నీరజ్ కి కష్టం అని చెప్పిన వెట్టర్... తొలి రెండు ప్రయత్నాల్లో క్వాలిఫై అవలేకపోయాడు. చివరగా మూడవ ప్రయత్నంలో అర్హత సాధించాడు.
భారత్ కి చెందిన మరో జావెలిన్ త్రోయర్ శివపాల్ సింగ్ అర్హత సాధించలేకపోయారు. గ్రూప్- బిలో పోటీపడ్డ శివపాల్ అతని పర్సనల్ బెస్ట్ ని రీచ్ కాలేకపోయాడు. తొలి ప్రయత్నంలో 76.40 మీటర్లు విసిరినా శివపాల్ సింగ్... రెండవ ప్రయత్నంలో 74.60 మీటర్లను మాత్రమే విసిరాడు. మూడవ ప్రయత్నంలో కూడా 80 మీటర్ల మార్కును అందుకోలేకపోయారు.
83.05 మీటర్ల అర్హత సాధించువారైనా లేదా టాప్ 12 బెస్ట్ అథ్లెట్లు 7వ తారీఖున జరిగే ఫైనల్స్ లో తలపడనున్నారు. భారత అథ్లెట్ నీరజ్ చోప్రా పై ఆశలు భారీగా ఉన్నాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో భారత్ పతక ఆశలన్నిటిని నీరజ్ మోస్తున్నాడు.