41 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ... భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో 5-4 తో జర్మనీని ఓడించి కాంస్య పతకం సాధించింది.

41 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ... భారత హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్ లో 5-4 తో జర్మనీని ఓడించి కాంస్య పతకం సాధించింది. 1980 తరువాత భారత హాకీ జట్టు జర్మనీపై అద్భుతమైన విజయం సాధించి భారత్ కు కాంస్యాన్ని అందించింది. సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపించిన మ్యాచులో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగింది. 

మ్యాచ్ ఆరంభమైన తొలి క్షణాల నుంచే భారత్ పై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేసింది జర్మనీ. భారత్ గోల్ పోస్ట్ పై వరుస దాడులు చేసింది జర్మనీ. మ్యాచు ప్రారంభమైన రెండు నిముషాల లోపే జర్మనీ తన తొలి గోల్ ని సాధించింది. భారత్ డిఫెన్సె కోటను బద్దలు కొడుతూ సెంటర్ నుంచి బాల్ ని డ్రిబుల్ చేస్తూ తొలి గోల్ ని జర్మనీ సాధించింది. 

ఆ తరువాత వెంటనే భారత్ జర్మన్ డి లోకి బాల్ ని తీసుకెళ్లి పెనాల్టీ కార్నర్ అవకాశాన్ని పొందినప్పటికీ... భారత్ దాన్ని గోల్ గా మరల్చలేకపోయింది. ఆది నుండి ఎగ్రెసివ్ గా ఆడిన జర్మనీ... తొలి హాఫ్ అంతా కూడా భారత గోల్ పోస్టు పై వరుస దాడులను కొనసాగించింది. ఆట ముగిసే క్షణాల ముందు జర్మనీ పెనాల్టీ కార్నర్ ని సాధించింది. భారత రషర్ అమిత్ రోహిదాస్ కాలు తగలడంతో మరో పెనాల్టీ కార్నర్ ని సాధించింది జర్మనీ. మరోసారి కూడా అదే సీన్ రిపీట్ అవడంతో మూడవ పెనాల్టీ కార్నర్ దక్కింది. ఆతరువాత ఫీల్డ్ అంపైర్ పెనాల్టీ కార్నర్ ని  రీటేక్ చేయమని చెప్పాడు. కానీ చివర్కౌ ఈ డ్రామాలో ఎటువంటి డామేజ్ జరగకుండా భారత డిఫెన్సె తమ కోటను కాపాడుకుంది. తొలి క్వార్టర్ ముగిసేసరికి జర్మనీ 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. ఈ మొత్తం క్వార్టర్ కూడా భారత కీపర్ శ్రీజేష్ అడ్డుగోడగా నిలబడి భారత గోల్ పోస్ట్ ని ఒక్కసారి తప్ప ప్రతిసారి కాచి కాపాడాడు. 

రెండవ క్వార్టర్ ప్రారంభంలో భారత్ జెర్మన్లపై ఫుల్ ప్రెస్ చేసే ప్రయత్నం చేసింది. మిడ్ ఫీల్డ్ లో హార్దిక్, ఆ తరువాత నీలకంఠ ఇచ్చిన అద్భుతమైన పాస్ లను అందుకున్న సిమ్రన్జీత్ పవర్ఫుల్ టోమోహక్ తో భారత్ కు తొలి గోల్ ని అందించి స్కోర్ ని సమం చేసారు. ఇక ఆ తరువాత సెకండ్ హాఫ్ మరో 7 నిముషాల్లో ముగుస్తుందనకా... మిడ్ ఫీల్డ్ లో భారత ప్లేయర్స్ చేసిన చిన్న తప్పిదం వల్ల జెర్మన్లు బాల ని తమ కంట్రోల్ లోకి తెచ్చుకొని అత్యంత సునాయాసంగా ఫీల్డ్ గోల్ ని సాధించారు. ఆ వెంటనే మరో రెండు నిముషాల వ్యవధిలో భారత డిఫెన్సె మరొక తప్పిదం వల్ల జర్మనీ మూడవ గోల్ ని సాధించి 3-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

ఆ వెంటనే తేరుకున్న భారత్.... వెంటనే బాల ని జర్మన్ డి లోకి తీసుకెళ్లి మరొక పెనాల్టీ కార్నర్ ని సాధించింది. ఈసారి దాన్ని గోల్ గా కన్వర్ట్  చేసి 2-3 కి జర్మన్ ఆధిక్యాన్ని ఒకింత తగ్గించింది. ఇక సెకండ్ క్వార్టర్ ముగిసే ముందు భారత్ మరొక పెనాల్టీ కార్నర్ అవకాశం సాధించింది. దాన్ని గోల్ గా మరల్చడంలో ఎటువంటి తప్పిదం చేయకుండా... హర్మన్ప్రీత్ సింగ్ గోల్ గా మరల్చి 3-3 తో స్కోర్స్ ని సమం చేసింది భారత్. ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి భారత్, జెర్మనీలు 3-3తో సమానంగా నిలిచాయి. 

ఇక మూడవ క్వార్టర్ ఆరంభంలోనే భారత్ పెనాల్టీ స్ట్రోక్ ని సాధించింది. దాన్ని రూపిందర్ అద్భుతమైన గోల్ గా మరల్చి భారత్ కి 4-3 తో ఆధిక్యాన్ని అందించాడు. 5 నిమిషాల వ్యవధిలో భారత్ మూడు గోల్స్ ని సాధించింది. ఇక భారత్ తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ మరికొన్ని నిముషాల వ్యవధిలోనే మరొక ఫీల్డ్ గోల్ ని సాధించింది. గుర్జన్త్ ఇచ్చిన అద్భుతమైన పాస్ ని సిమ్రన్జీత్ అద్భుతమైన సెంటర్ ఆఫ్ మిడ్ ఫీల్డ్ ముందు గోల్ గా మరల్చారు. దీనితో భారత్ 5-3 కి తమ ఆధిక్యాన్ని పెంచుకొని 2 గోల్స్ కుషన్ ని సాధించింది. మూడవ క్వార్టర్ ముగిసేసరికి కూడా భారత్ 5-3 ఆధిక్యంలో నిలిచింది. మూడవ క్వార్టర్ ముగిసేసరికి భారత్, జర్మనీలు తమ వీడియో రిఫెరల్స్ ని కోల్పోయాయి.  

నాలుగవ క్వార్టర్ లో భారత్ పై జర్మనీ ఎదురుదాడికి దిగింది. ఆట ప్రారంభమైన మూడు నిముషాలలోపే జర్మనీ గోల్ ని సాధించి భారత్ ఆధిక్యాన్ని 5-4 కి తగ్గించింది. ఆ తరువాత భారత్ కూడా జర్మనీ గోల్ పోస్ట్ పై దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. ఆఖరు నాలుగున్నర నిమిషాల్లో జర్మనీ తమ గోల్ కీపర్ ని కూడా తీసేసి అతని బదులు కూడా ఫార్వర్డ్ గా ఆడించింది. 

మ్యాచులో ఆఖరి రెండు నిముషాలు ఉందనగా జర్మనీ పెనాల్టీ కార్నర్ ని సాధించింది. భారత్ అద్భుతమైన డిఫెన్సె ఇక్కడ కలిసి వచ్చింది. చివర్లో 6 సెకండ్లు ఉందనగా జర్మనీ పెనాల్టీ కార్నర్ ని సాధించింది. భారత కీపర్ దాన్ని ఆడుకోవడంతో భారత్ కల నెరవేరింది.