నెదర్లాండ్ జోరు ముందు నిలవలేకపోయిన భారత మహిళా హాకీ జట్టు...టీమిండియా తరుపున ఏకైక గోల్ చేసిన కెప్టెన్ రాణి రాంపాల్...

ఒలింపిక్స్ పురుషుల హాకీ టీమ్‌కి శుభారంభం దక్కినా, మహిళా జట్టుకి మాత్రం ఓటమి ఎదురైంది. పటిష్టమైన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 1-5 తేడాతో ఓడింది భారత వుమెన్స్ హాకీ టీమ్.

ఆట ప్రారంభమైన 6వ నిమిషంలోనే నెదర్లాండ్స్ ప్లేయర్ ఫెలిస్ అల్బర్స్‌ గోల్ చేసి, తన జట్టుకి ఆధిక్యాన్ని అందించింది. అయితే 10వ నిమిషంలో భారత కెప్టెన్ రాణి రాంపాల్ గోల్ చేసి స్కోరును 1-1 తేడాతో సమం చేసింది.

మొదటి రెండు క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్ ప్లేయర్లు, గోల్ చేయడానికి చేసిన ప్రయత్నాలను భారత జట్టు సమర్థవంతంగా అడ్డుకోగలిగింది. అయితే మూడో క్వార్టర్‌లో నెదర్లాండ్స్ జోరు ముందు టీమిండియా నిలవలేకపోయింది. 

33వ నిమిషంలో మార్గాట్ జెఫెన్ గోల్ చేయగా, 43వ నిమిషంలో ఫెలిస్ అల్బర్స్, 45వ నిమిషంలో ఫెడేరిక్ మట్లా వరుస గోల్స్ చేయడంతో మూడో క్వార్టర్ ముగిసేసరికి 4-1 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లింది నెదర్లాండ్. నాలుగో క్వార్టర్‌లో 52వ నిమిషంలో వాన్ మసక్కర్ గోల్ చేయడంతో 1-5 తేడాతో మ్యాచ్‌ను ముగించింది నెదర్లాండ్ జట్టు.