పెనాల్టీ కార్నర్స్ రూపంలో వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేకపోయిన భారత జట్టు... భారత జట్టు తరుపున ఏకైక గోల్ చేసిన దిల్‌ప్రీత్ సింగ్...ఆస్ట్రేలియా చేతుల్లో 7-1 తేడాతో ఓడిన భారత మెన్స్ హాకీ జట్టు...

టోక్యో ఒలింపిక్స్‌లో మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయాన్ని అందుకున్న భారత పురుషుల హాకీ జట్టు, రెండో మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడింది. 

ఆట ప్రారంభమైన రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ రూపంలో భారత జట్టుకి గోల్ చేసే అవకాశం దక్కింది. అయితే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో టీమిండియా ఆలస్యం చేయడంతో గోల్ చేసినా, అది లెక్కలోకి రాలేదు.

ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్న ఆస్ట్రేలియా, భారత జట్టుపై తిరుగులేని ఆధిపత్యాన్ని చూపించింది. ఆట 10వ నిమిషంలో మొదటి గోల్ చేసిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత 21వ, 23వ, 26వ నిమిషాల్లో గోల్స్ చేసి రెండో క్వార్టర్ ముగిసేసరికి 4-0 తేడాతో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. 

మూడో క్వార్టర్‌లో భారత జట్టు తరుపున దిల్‌ప్రీత్ సింగ్ ఒక్కడే, ఆట 34వ నిమిషంలో ఏకైక గోల్ చేయగలిగాడు. అయితే ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్ చేసిన ఆస్ట్రేలియా, నాలుగో క్వార్టర్‌లో మరో గోల్ చేసి 7-1 తేడాతో క్లీన్ విక్టరీ సాధించింది.