టోక్యో ఒలింపిక్స్: రవి కుమార్ దహియాకు కేసీఆర్ అభినందనలు
టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రవి కుమార్ దహియాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. విశ్వక్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించడం సంతోషకరమని సీఎం వ్యాఖ్యానించారు.
టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన రవి కుమార్ దహియాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఆయన సిల్వర్ మెడల్ సాధించడం సంతోషకరమన్నారు. రవి కుమార్ అత్యంత ప్రతిభతో ఫైనల్ చేరుకున్నారని సీఎం కొనియాడారు. రవి కుమార్ క్రీడా స్పూర్తి దేశకీర్తిని మరింత ఇనుమడింపజేసిందని కేసీఆర్ అన్నారు. విశ్వక్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించడం సంతోషకరమని సీఎం వ్యాఖ్యానించారు.
కాగా, టోక్యో ఒలింపిక్స్ 2020 రెజ్లింగ్లో ఫైనల్ చేరిన భారత రెజ్లర్ రవికుమార్ దహియా... తుది మెట్టు మీద పోరాడి ఓడాడు. 57 కేజీల విభాగంలో రష్యాకి చెందిన జవుర్ ఉగేవ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రవికుమార్ దహియా... 4-7 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకున్నాడు.
ALso Read:టోక్యో ఒలింపిక్స్: ఫైనల్లో పోరాడి ఓడిన రవికుమార్ దహియా... భారత్కి రజత పతకం...
తొలి బ్రేక్ సమయానికి 2-4 తేడాతో ఆధిక్యం సాధించిన జవుర్, ఆ తర్వాత వరుస పాయింట్లు స్కోరు చేసి 2-7 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండు పాయింట్లు సాధించిన రవికుమార్ 4-7 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించాడు. 2012 లండన్ ఒలింపక్స్తో రజతం గెలిచిన రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత ఒలింపిక్స్లో రజతం గెలిచిన భారత రెజ్లర్గా నిలిచాడు రవికుమార్ దహియా.
రవికుమార్ దహియా పతకంతో కలిపి టోక్యో ఒలింపిక్స్లో భారత పతకాల సంఖ్య 5కి చేరింది. వెయిట్ లిఫ్టింగ్లో మీరాభాను ఛాను రజతం సాధించగా, బ్యాడ్మింటన్లో పీవీ సింధు, బాక్సింగ్లో లవ్లీనా కాంస్య పతకాలు సాధించారు. భారత పురుషుల హాకీ, జర్మనీని ఓడించి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.